IND vs PAK : 58 పరుగుల తేడాతో ఘన విజయం..ఇండియా-పాక్ మ్యాచ్‌లో కొనసాగుతున్న నో షేక్ హ్యాండ్ పాలసీ

IND vs PAK : అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం బులవాయో వేదికగా జరిగిన సూపర్-6 కీలక పోరులో భారత్ 58 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా, దాయాది పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే మైదానంలో ఆట కంటే కూడా ఇరు జట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే హైలైట్‌గా నిలిచాయి.

IND vs PAK : 58 పరుగుల తేడాతో ఘన విజయం..ఇండియా-పాక్ మ్యాచ్‌లో కొనసాగుతున్న నో షేక్ హ్యాండ్ పాలసీ
Ind Vs Pak (2)

Updated on: Feb 01, 2026 | 9:57 PM

IND vs PAK : అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం బులవాయో వేదికగా జరిగిన సూపర్-6 కీలక పోరులో భారత్ 58 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా, దాయాది పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే మైదానంలో ఆట కంటే కూడా ఇరు జట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే హైలైట్‌గా నిలిచాయి. టాస్ సమయం నుంచి మ్యాచ్ ముగిసే వరకు కనీసం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ఆటగాళ్లు నిరాకరించడం చర్చనీయాంశమైంది.

జింబాబ్వేలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ ఒక రణరంగాన్ని తలపించింది. టాస్ వేసినప్పటి నుంచే వాతావరణం వేడెక్కింది. భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ సంప్రదాయబద్ధంగా ఇచ్చుకోవాల్సిన షేక్ హ్యాండ్ చేసుకోకుండానే మ్యాచ్ మొదలుపెట్టారు. 2025 ఆసియా కప్ నుంచి మొదలైన ఈ నో షేక్ హ్యాండ్ సంప్రదాయం ఈ మెగా టోర్నీలోనూ కొనసాగింది. రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం క్రీడలపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68 పరుగులు) ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21*) మెరుపులు మెరిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అయితే పాకిస్థాన్ సెమీస్ రేసులో ఉండాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంది. కానీ భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు కకావికలమయ్యారు.

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ఆయుష్ మ్హాత్రే (3/21), ఖిలన్ పటేల్ (3/35) పాక్ వెన్నులో వణుకు పుట్టించారు. కేవలం 43 పరుగుల వ్యవధిలోనే పాక్ చివరి 8 వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఈ 58 పరుగుల విజయంతో భారత్ గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో భారత్ ఫిబ్రవరి 4న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు పలకరించుకోకుండానే మైదానాన్ని వీడటం గమనార్హం.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..