
Rinku Singh : భారత స్టార్ ఆల్ రౌండర్ రింకూ సింగ్ ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ 2025 కోసం టీమిండియాతో ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్ను ఆతిథ్య జట్టు యూఏఈతో ఆడనుంది. ఈ మ్యాచ్కి ముందు రింకూ సింగ్ తన జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ నిజం చెప్పాడు. తన చేతి మాంసాన్ని ఒక జంతువు తినేసిందని, దానివల్ల తన చేతి బరువు ఒక కేజీ తగ్గిపోయిందని రింకూ చెప్పాడు. ఆసియా కప్ కోసం యూఏఈ బయలుదేరే ముందు రింకూ సింగ్, రాజ్ శమానీతో ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఆసియా కప్లో భారత జట్టు ప్రచారం మొదలవడానికి ఒక రోజు ముందు విడుదలయింది. అందులో రింకూ తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పాడు. తన ఎడమ చేయి బరువు కుడి చేతి కంటే ఒక కేజీ తక్కువగా ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
రింకూ సింగ్ చేతిని పట్టుకున్న కోతి
“నా చిన్నతనంలో నేను మా అన్నయ్యతో కలిసి వర్షంలో పొలాల వైపు వెళ్తున్నాను. అప్పుడు ఒక కోతి వచ్చి నా ఎడమ చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పుడు నన్ను కాపాడేందుకు ఎవరూ లేరు. మా అన్నయ్య రాయి విసిరి కోతిని తరిమేయడానికి ప్రయత్నించాడు. కానీ కోతి చేతిని వదలడానికి సిద్ధంగా లేదు. చివరికి కోతి నా చేతిని వదిలినప్పుడు, చేతి మాంసం చాలా వరకు ఊడిపోయింది. లోపల ఎముక కూడా కనిపించింది” అని రింకూ సింగ్ చెప్పారు.
ఒక కేజీ తక్కువ బరువు
ఆ తర్వాత తాను బతుకుతానా లేదా అని అందరూ ఆందోళన చెందారని రింకూ తెలిపారు. ఇటీవల ఎన్సీఏలో తన రెండు చేతులకు డెక్సా స్కాన్ చేయగా, రెండు చేతుల బరువు మధ్య ఒక కేజీ తేడా ఉందని తెలిసిందని రింకూ చెప్పారు. అంటే, కోతి కోరిన ఎడమ చేతి బరువు, కుడి చేతి కంటే ఒక కేజీ తక్కువగా ఉంది.
బరువు తక్కువగా ఉన్న చేతితో ఇబ్బందులు
ఒక చేయి బరువు తక్కువగా ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అనే ప్రశ్నకు రింకూ సమాధానం చెబుతూ “ఖచ్చితంగా ఉంది. నేను నా కుడి చేతితో ఎంత బరువు ఎత్తగలనో, నా ఎడమ చేతితో అంత బరువు ఎత్తలేను” అని వివరించారు. ఈ సంఘటన తర్వాత కూడా తన ఆటను కొనసాగించడం, ఈ స్థాయికి ఎదగడం నిజంగా అభినందనీయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..