Viral Video : నీ బెదిరింపులు నా దగ్గర కాదు.. లీగల్ నోటీస్ చింపి నఖ్వీ మొఖాన కొట్టిన పిఎస్‌ఎల్ జట్టు యజమాని

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య వివాదం ఇప్పుడు బజారున పడింది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు యజమాని అలీ తారీన్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఎదురు తిరిగారు. పీసీబీ పంపిన లీగల్ నోటీసును అలీ తారీన్ సరాసరి కెమెరా ముందు చింపివేశారు.

Viral Video : నీ బెదిరింపులు నా దగ్గర కాదు.. లీగల్ నోటీస్ చింపి నఖ్వీ మొఖాన కొట్టిన పిఎస్‌ఎల్ జట్టు యజమాని
Ali Tareen

Updated on: Oct 24, 2025 | 6:11 PM

Viral Video : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య వివాదం ఇప్పుడు బజారున పడింది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు యజమాని అలీ తారీన్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఎదురు తిరిగారు. పీసీబీ పంపిన లీగల్ నోటీసును అలీ తారీన్ సరాసరి కెమెరా ముందు చింపివేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పీఎస్‌ఎల్‌ నిర్వహణపై అలీ తారీన్ చేసిన విమర్శలకు గాను, పీసీబీ ఆయనకు లీగల్ నోటీసు పంపింది. లీగ్ నిర్వహణ అసమర్థంగా ఉందని విమర్శించిన తారీన్‌పై పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది, తారీన్ ఎలా స్పందించారో చూద్దాం.

ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీ యజమాని అయిన అలీ తారీన్, ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పీఎస్‌ఎల్ నిర్వహణపై తీవ్ర విమర్శలు చేశారు. అలీ తారీన్ మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌ను అసమర్థ వ్యక్తులు నిర్వహిస్తున్నారని, అందుకే ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో లేదా ఆరో లెవల్ లీగ్‌గా మారిపోయిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పీఎస్‌ఎల్‌ను విమర్శించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అలీ తారీన్‌కు లీగల్ నోటీసును పంపింది.

పీసీబీ లీగల్ నోటీసు పంపిన తరువాత, అలీ తారీన్ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి, ఆ వివాదాన్ని మరింత పెంచారు. ఆ వీడియోలో తారీన్ మాట్లాడుతూ.. తాను క్షమాపణ చెప్పకపోతే, ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని, తనను వ్యక్తిగతంగా బ్లాక్‌లిస్ట్ చేస్తామని పీసీబీ బెదిరించిందని వెల్లడించారు.

“మీరు (పీసీబీ మేనేజ్‌మెంట్) ఇలాంటి బెదిరింపు మెసేజులు పంపితే నేను మౌనంగా ఉంటానని అనుకుంటే అది మీ అపోహే. నాకు ఈ లీగ్‌పై మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ లీగ్ మనందరిది, అభిమానులది, మొత్తం పాకిస్థాన్‌ది” అని తారీన్ పీసీబీకి గట్టిగా సమాధానం ఇచ్చారు. తన వీడియో మెసేజ్ చివరిలో అలీ తారీన్, పీసీబీ లీగల్ నోటీసును తన చేతుల్లోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

“నేను క్షమాపణ చెబుతున్నాను. పీఎస్‌ఎల్ మెరుగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కొన్ని లోపాలను గుర్తించినప్పుడు, వాటిపై గొంతెత్తినందుకు క్షమాపణ చెబుతున్నాను. మీరు ఇంత తక్కువ చేసి కూడా ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకోవడం నాకు నచ్చనందుకు క్షమించండి” అని పీసీబీని ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా క్షమాపణ చెప్పారు. వీడియో చివరలో లీగల్ నోటీసును పైకి లేపి, కోపంతో దానిని రెండు ముక్కలు చేసి చింపేశాడు. పీసీబీ అధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో కూడా తనపై నోటీసు పంపినట్లు తారీన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..