
India vs New Zealand ODI: బలహీనంగా భావించిన న్యూజిలాండ్ జట్టు, భారతదేశానికి వచ్చిన తర్వాత మరోసారి సంచలనం సృష్టించింది. జనవరి 18 ఆదివారం ఇండోర్లో జరిగిన మూడో వన్డేను గెలుచుకోవడం ద్వారా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. 2024లో భారత గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఇప్పుడు 38 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా, స్వదేశంలో వన్డే సిరీస్లో టీమిండియాను ఓడించడం ద్వారా చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్ వంటి రెగ్యులర్ ఆటగాళ్లు ఈ జట్టులో లేరు.
న్యూజిలాండ్ ‘బి’ జట్టు చేతిలో సిరీస్ ఓడిపోయిన తర్వాత, టీమిండియా గురించి ప్రశ్నలు అనివార్యం. ఈ సిరీస్లో ‘మెన్ ఇన్ బ్లూ’ ఎక్కడ తప్పు చేసింది అనేది పెద్ద ప్రశ్న? సేనా దేశాల (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) బ్యాట్స్మెన్స్ భారతదేశానికి వచ్చినప్పుడు భారత స్పిన్నర్లకు లొంగిపోయే సమయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ బలం ఆయా జట్లకు అతిపెద్ద ఆయుధంగా మారుతోంది.
న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత స్పిన్ బౌలర్లు పూర్తిగా అసమర్థులుగా నిరూపితమయ్యారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యూజిలాండ్ కొత్త స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కంటే ఎక్కువ విజయవంతమయ్యారు. ఇండోర్ వన్డేను చూస్తే.. కుల్దీప్, జడేజా స్పిన్ ద్వయం ఒక్కొక్కరు ఆరు ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ 12 ఓవర్లలో, కివీస్ బ్యాట్స్మెన్స్ 89 పరుగులు పిండుకున్నారు. రవీంద్ర జడేజా వికెట్ కోసం ఆరాటపడి మళ్ళీ నిరాశపరిచాడు. ఆరు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చిన తర్వాత కుల్దీప్ ఒక వికెట్ తీసుకోగలిగాడు.
ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండు జట్ల స్పిన్నర్లు విఫలమయ్యారని కాదు. తన రెండవ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న జాడెన్ లెన్నాక్స్, మూడవ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి, భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ 10 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ పై జరిగిన అవమానకరమైన ఓటమికి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు నిజమైన దోషులు. ఎందుకంటే వారు ఇండోర్ లో మాత్రమే కాకుండా మిగతా రెండు మ్యాచ్ లలో కూడా అసమర్థులుగా నిలిచారు. అత్యంత ఆశ్చర్యకరంగా, రవీంద్ర జడేజా సిరీస్ అంతటా వికెట్ కోసం ఆరాటపడ్డాడు. ఒక్క బ్రేక్ త్రూ కూడా సాధించలేకపోయాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ చాలా ఖరీదైనవాడి మారాడు.
న్యూజిలాండ్తో జరిగిన రెండవ, మూడవ వన్డేలలో ఓడిపోయిన తర్వాత, భారత కెప్టెన్ శుభ్మాన్ గిల్, స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో విఫలమవడమే జట్టు ఇబ్బందుల్లో పడటానికి కారణమని అంగీకరించాడు. ఇండోర్లో ఫాస్ట్ బౌలర్లు బాగా రాణించారు. హర్షిత్, అర్ష్దీప్, సిరాజ్ కలిసి ఏడు వికెట్లు పడగొట్టారు. కానీ స్పిన్నర్లు నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులు చేయగలిగింది.