KL Rahul Captain : టెస్ట్ తర్వాత వన్డే వార్.. ఊహించని వ్యక్తికి కెప్టెన్సీ అప్పజెప్పిన టీమిండియా మేనేజ్మెంట్

భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్‌కు సంబంధించి టీమిండియా స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

KL Rahul Captain  : టెస్ట్ తర్వాత వన్డే వార్.. ఊహించని వ్యక్తికి కెప్టెన్సీ అప్పజెప్పిన టీమిండియా మేనేజ్మెంట్
Kl Rahul

Updated on: Nov 24, 2025 | 7:29 AM

KL Rahul Captain : భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్‌కు సంబంధించి టీమిండియా స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన కేఎల్ రాహుల్‌కు వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

కేఎల్ రాహుల్ సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. గతంలో 2023లో కూడా రాహుల్ సౌతాఫ్రికా పైనే వన్డే సిరీస్‌లో టీమిండియాను నడిపించడం యాదృచ్ఛికం. ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో నలుగురు ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి వస్తున్నారు. వారిలో ముఖ్యమైన పేరు రవీంద్ర జడేజా. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జడేజాను ఎంపిక చేయకపోవడంతో అతని కెరీర్‌పై సందేహాలు తలెత్తాయి. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆ ఊహాగానాలను ఖండిస్తూ రవీంద్ర జడేజా తమ ప్రణాళికలో భాగమని అప్పుడే స్పష్టం చేశారు.

జడేజా లాగానే, మరో కీలక ఆటగాడు రిషబ్ పంత్ కూడా జట్టులోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పంత్ ఈ ఫార్మాట్‌లో తిరిగి వచ్చినా, ట్రోఫీలో ఆయనకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపింగ్ బాధ్యతలను రాహులే చూసుకున్నారు. కాబట్టి ఈ సిరీస్‌లో పంత్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2023 తర్వాత మొదటిసారిగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. అలాగే యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ కూడా ఈ సిరీస్‌లో అవకాశాన్ని అందుకున్నారు.

మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే ఫార్మాట్ నుంచి విశ్రాంతి కొనసాగుతోంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఈ సిరీస్‌కు బ్రేక్ ఇచ్చారు. రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడంతో, మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించారు.

వన్డే సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.

మొదటి వన్డే: నవంబర్ 30, రాంచీ.

రెండో వన్డే: డిసెంబర్ 3, రాయ్‌పూర్.

చివరి వన్డే: డిసెంబర్ 6, విశాఖపట్నం.

వన్డే సిరీస్‌కు భారత స్క్వాడ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్, అర్ష్‌దీప్ సింగ్.