
Vaibhav Suryavanshi: క్రికెట్ ప్రపంచంలోకి మరో సంచలనం ఐపీఎల్ 2025 నుంచి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి రికార్డులు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై విధ్వంసం సృష్టించాడు. యువ క్రికెటర్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 19 బంతుల్లో 48 పరుగులు చేసి, ఒకే ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాది వార్తల్లో నిలిచాడు.
అంచనాలను మించిన ప్రదర్శన..
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు అండర్-19 స్థాయిలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇంగ్లాండ్ అండర్-19 నిర్దేశించిన 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగి టీ20 తరహాలో రెచ్చిపోయాడు. అతని దూకుడు ఇన్నింగ్స్ భారత జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది.
ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు..
వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో హైలైట్ ఆరవ ఓవర్. ఇంగ్లాండ్ బౌలర్ జాక్ హోమ్ వేసిన ఆ ఓవర్లో వైభవ్ ఏకంగా మూడు భారీ సిక్సర్లు బాది అభిమానులను ఉర్రూతలూగించాడు. అతని బ్యాట్ నుంచి వెలువడిన ప్రతి షాట్ పవర్తో కూడుకుని ఉండటంతో, బంతి బౌండరీ లైన్ అవతల పడటానికి పెద్దగా సమయం పట్టలేదు. ఈ మూడు సిక్సర్లతో అతను తన విధ్వంసకర బ్యాటింగ్ స్టైల్ను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఓవర్లో అతను మొత్తం 21 పరుగులు రాబట్టాడు.
ఐపీఎల్ ప్రభావం..
ఐపీఎల్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని మంచి అనుభవాన్ని సంపాదించుకున్న వైభవ్, అదే లయను ఇంగ్లాండ్ అండర్-19 సిరీస్లో కూడా కొనసాగిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి మెగా లీగ్లో అరంగేట్రం చేసి, రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక గొప్ప ఆస్తిగా మారతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్లో అతను 7 మ్యాచ్లలో 252 పరుగులు చేసి, ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సత్తా చాటాడు.
భారత్ ఘన విజయం..
వైభవ్ సూర్యవంశీ (48 పరుగులు), అభిజ్ఞాన్ కుండు (45 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ సహాయంతో, భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ అండర్-19ని 6 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 5 మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్లోని తదుపరి మ్యాచ్ జూన్ 30న జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ప్రతిభావంతులు భారత క్రికెట్కు లభించడం శుభపరిణామం అని చెప్పాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..