
వైభవ్ సూర్యవంశీ, అయుష్ మాత్రే లాంటి యువ ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ దృష్టిలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నాడని తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్పై కేవలం 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్ను అశ్విన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అతడు భారీ ఇన్నింగ్స్లు ఆడగలడని, అలాగే అతని వద్ద వైవిధ్యమైన షాట్లు ఉన్నాయని అశ్విన్ పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే లాంటి యువ సంచలనాలతో పోలిస్తే, ప్రియాన్ష్ ఆర్యలో ఉన్న నిలకడ, గేమ్ను శాసించే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ప్రియాన్ష్ ఆర్య ఇప్పటివరకు 211 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ దాదాపు 248 ఉండటం గమనార్హం. ఇందులో 20 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అటు వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్ రాయల్స్) కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, అతన్ని ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి పంపవద్దని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని అశ్విన్ సూచించాడు.
మరోవైపు ప్రస్తుతం లీగ్లో ముగ్గురు యువ ఆటగాళ్లు తమ పవర్ హిట్టింగ్తో పోటీపడుతున్నారు. పరుగుల పరంగా అభిషేక్ శర్మ 7 మ్యాచ్ల్లో 323 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ 246 పరుగులతో రెండో స్థానంలో, ప్రియాన్ష్ ఆర్య 211 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక సెంచరీల పరంగా అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉండగా, స్ట్రైక్ రేట్ పరంగా ప్రియాన్ష్ ఆర్య(249.00) అందరికంటే ముందున్నాడు. వైభవ్ సూర్యవంశీ కూడా భీకరమైన ఫామ్తో 237 స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. మొత్తానికి ఈ యువ త్రయం ఐపీఎల్లో పవర్ హిట్టింగ్ అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. రాబోయే మ్యాచ్ల్లో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..