
IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమే అదిరిపోయింది. కేవలం మూడు మ్యాచ్లు ముగిశాయో లేదో అప్పుడే పాయింట్ల పట్టికలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్తో సీజన్కు అసలైన కిక్ ఇచ్చారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన భారీ విజయం పాయింట్ల పట్టికను తలకిందులు చేసింది. ఐపీఎల్ 2026లో వరుసగా మూడు మ్యాచ్లు ముగిశాయి. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయాలు నమోదు చేయగా.. మూడో పోరులో రాజస్థాన్ రాయల్స్ తన ప్రతాపం చూపింది. గువహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్
ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంది. దీనివల్ల ఆ జట్టుకు పాయింట్లతో పాటు భారీ నెట్ రన్ రేట్ లభించింది.
నంబర్ 1 స్థానంలో రాజస్థాన్ రాయల్స్
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై జట్ల ఖాతాలో రెండేసి పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ విషయంలో రాజస్థాన్ అందరికంటే ముందుంది.
రాజస్థాన్ రాయల్స్: +4.171 NRR తో మొదటి స్థానం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: +2.907 NRR తో రెండో స్థానం.
ముంబై ఇండియన్స్: +0.687 NRR తో మూడో స్థానంలో ఉన్నాయి.
చెన్నైకి కోలుకోలేని దెబ్బ
రాజస్థాన్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో భారీ మూల్యం చెల్లించుకుంది. కేవలం మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా.. నెట్ రన్ రేట్ పరంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది. చెన్నై రన్ రేట్ ప్రస్తుతం (-)4.171 కి పడిపోయింది. ప్రస్తుతం పట్టికలో ఆరో స్థానంలో ఉన్న సీఎస్కే.. మిగిలిన జట్లు తమ తొలి మ్యాచ్లు ఆడిన తర్వాత ఆఖరి స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ భారీ రన్ రేట్ మైనస్ను అధిగమించాలంటే చెన్నై రాబోయే మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది.
తదుపరి పోరు ఎక్కడ?
ఇక అందరి కళ్లు మంగళవారం (మార్చి 31) జరగబోయే నాలుగో మ్యాచ్పై ఉన్నాయి. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశం ఉంది.