
ఐపిఎల్ భారత ఆటగాళ్లకు సత్తాను నిరూపించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక పర్వత ప్రాంత రైతు కొడుకు కూడా ఈరోజు ఐపీఎల్లో కోట్లు సంపాదిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి దిగ్గజాలతో బ్యాటింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతడు ఎవరో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు అనూజ్ రావత్.

22 ఏళ్ల అనూజ్ 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నైనిటాల్ సమీపంలోని రామ్నగర్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అనూజ్ తండ్రి రైతు. అనూజ్ చిన్నతనంలో పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. అయితే అతను క్రికెట్ చూడటం ప్రారంభించినప్పుడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ లాగా ఉండాలని కోరుకున్నాడు.

అనూజ్ తండ్రి స్థానిక క్రికెటర్. మెరుగైన శిక్షణ పొందాలనే ఉద్దేశ్యంతో తన కొడుకుని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీలో కోహ్లి లాంటి బ్యాట్స్మెన్ని దేశానికి అందించిన రాజ్కుమార్ శర్మ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అనూజ్ శిక్షణ ప్రారంభించాడు.

అనూజ్కి ఉన్న పెద్ద బలం ఏంటంటే అతను ఏ నంబర్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతను ఏజ్ గ్రూప్ క్రికెట్లో మొదటి మూడు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. రంజీ ట్రోఫీలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. అనూజ్కి మొదటిసారి రంజీ ట్రోఫీ ఆడే అవకాశం వచ్చినప్పుడు అతని వేలు దెబ్బతింది. అయినప్పటికీ 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను అండర్-19 ఆసియా కప్లో పాల్గొనే అవకాశాన్ని పొందాడు.

ఐపీఎల్ 2022 వేలానికి ముందు అనూజ్ రావత్ దేశవాళీ క్రికెట్లో బౌండరీ హిట్టర్గా నిరూపించుకున్నాడు. వేలంలో ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్తో పాటు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ కోసం వెతుకుతోంది. వేలంలో రావత్ని రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేశారు.