Shivam Dube : భార్య పెట్టిన స్టోరీ పవర్ ఏమో కానీ.. దూబే మాత్రం గ్రౌండ్‌లో పూనకం వచ్చినట్టు ఆడాడు

India vs New Zealand T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన అతని భార్య అంజమ్ ఖాన్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.

Shivam Dube : భార్య పెట్టిన స్టోరీ పవర్ ఏమో కానీ.. దూబే మాత్రం గ్రౌండ్‌లో పూనకం వచ్చినట్టు ఆడాడు
Shivam Dube

Updated on: Mar 09, 2026 | 3:46 PM

Shivam Dube :అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా ఆదివారం (మార్చి 8) టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, 2026 టీ20 వరల్డ్ కప్ కిరీటాన్ని ముద్దాడింది. ఈ అద్భుత విజయంలో కేరళ స్టార్ సంజూ శాంసన్ తన విశ్వరూపం చూపించగా, ఆఖర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు కివీస్ తలవంచక తప్పలేదు. ఈ చారిత్రాత్మక గెలుపుతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచ విజేతగా నిలవడమే కాకుండా, సొంత గడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (52), సంజూ శాంసన్ (89) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో విరుచుకుపడి కివీస్ బౌలర్లను వణికించాడు. అయితే ఆఖర్లో శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టి భారత్ స్కోరును 250 మార్క్ దాటించాడు. చివర్లో జేమ్స్ నీషమ్ వేసిన ఓవర్‌లో దూబే వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో స్టేడియం హోరెత్తిపోయింది.

టీమిండియా విజయం తర్వాత శివమ్ దూబే భార్య అంజమ్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన భర్త పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోయిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస స్టోరీలు పెడుతూ తన ప్రేమను చాటుకుంది. మాషా అల్లా.. అల్హందులిల్లా.. నస్రుమినల్లా వ ఫథున్ కరీబ్ (విజయం చేరువలోనే ఉంది) అంటూ ఆమె చేసిన ప్రార్థన ఫలించింది. ఇదివరకే ఐపీఎల్ సమయంలో కూడా అంజమ్ ఇలాగే దూబేను ప్రోత్సహిస్తూ పోస్ట్‌లు పెట్టేది. భార్య అందించిన ఈ మద్దతు వల్లే దూబే మైదానంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 19 ఓవర్లలోనే 159 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (4 వికెట్లు), అక్షర్ పటేల్ (3 వికెట్లు) ప్రత్యర్థి నడ్డి విరిచారు. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52) ఒక్కడే పోరాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్, టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. వరుసగా రెండోసారి (2024 తర్వాత) టైటిల్ నిలబెట్టుకుని డిఫెండింగ్ ఛాంపియన్‎గా సత్తా చాటింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us