IND vs ENG: దటీజ్ ఇండియా పవర్.. మన కోసం మ్యాచ్ టైమింగ్స్ మార్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్!

ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోసం ECB కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ వీక్షకుల కోసం మ్యాచ్‌ సమయాలను ఒక గంట ముందుకు జరిపింది. జూలై 1 నుంచి జరిగే ఈ సిరీస్‌కు సంబంధించి వన్డే టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ నిర్ణయం భారత మార్కెట్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.

IND vs ENG: దటీజ్ ఇండియా పవర్.. మన కోసం మ్యాచ్ టైమింగ్స్ మార్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్!
Ind Vs Eng T20i

Updated on: Jun 09, 2026 | 1:28 PM

టీ20 సిరీస్ కోసం టీమిండియా, ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పులు చేసింది. భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మూడు టీ20 మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను గంట ముందుకు జరిపింది. జూలై 1 నుంచి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. మొదట సాయంత్రం 6.30 గంటలకు (BST) ప్రారంభం కావాల్సిన మూడు టీ20 మ్యాచ్‌లు ఇప్పుడు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు రాత్రి ఆలస్యంగా కాకుండా కొంత ముందుగానే ముగియనున్నాయి. భారతదేశంలో టెలివిజన్ వీక్షకుల సంఖ్యను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

ఈ సిరీస్ ప్రసార హక్కులను యూకేలో స్కై స్పోర్ట్స్, భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో భారత మార్కెట్ ఎంత కీలకమైందో ఈ నిర్ణయం మరోసారి స్పష్టం చేసింది. భారత జట్టు పాల్గొనే సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపార విలువ ఉండటంతో ప్రసార సంస్థలు కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. ఈసీబీ ఇటీవల విడుదల చేసిన ఆర్థిక నివేదికలో కూడా భారత జట్టుతో జరిగే సిరీస్‌లు తమకు అధిక ఆదాయం అందించే ప్రసార ఈవెంట్లుగా పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ పర్యటన కారణంగా లాభాలు వస్తాయని, 2027లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ కారణంగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక ఈ సిరీస్‌పై అభిమానుల ఆసక్తి టిక్కెట్ల అమ్మకాల ద్వారానే స్పష్టమవుతోంది. మూడు వన్డే మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోగా, టీ20 మ్యాచ్‌లకు కూడా చాలా తక్కువ టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవన్షీ ఎంపికపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనే అతడు అరంగేట్రం చేసే అవకాశముండటంతో భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us