T20 World Cup 2026 : హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్కోరుకు వాంఖడే సిద్ధం..ఈ పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలైపోయింది. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

T20 World Cup 2026 : హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్కోరుకు వాంఖడే సిద్ధం..ఈ పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
Ind Vs Usa Pitch Report

Updated on: Feb 07, 2026 | 3:01 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలైపోయింది. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. వాంఖడే స్టేడియం అంటేనే పరుగుల ప్రవాహం. మరి ఈ రోజు పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది? బౌలర్లు వికెట్లు తీస్తారా లేక బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తారా? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ముంబైలోని వాంఖడే స్టేడియం పిచ్ సహజంగానే ఎర్రమట్టితో తయారవుతుంది. ఇక్కడ బౌలర్లకు మంచి అదనపు బౌన్స్ లభించినప్పటికీ, పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి అవుట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉండటం వల్ల బ్యాటర్లు కొట్టిన చిన్న షాట్లు కూడా బౌండరీకి వెళ్తాయి. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మరింత మెరుగుపడుతుంది కాబట్టి, టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుని, ఛేజింగ్ చేయడానికే ఇష్టపడుతుంది. ఒకవేళ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల ఫామ్‌ను బట్టి టీ20ల్లో 300 పరుగుల మార్కును తాకినా ఆశ్చర్యం లేదు.

వాంఖడేలో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో భారత్ 4 గెలిచింది. గతేడాది ఇంగ్లాండ్‌పై భారత్ చేసిన 247 పరుగులే ఇక్కడ అత్యధిక స్కోరు. ఈ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీకి అత్యధిక పరుగులు ఉన్నప్పటికీ, యువ సంచలనం అభిషేక్ శర్మకు ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన ఘనత ఉంది. నేడు జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సిరాజ్ తన స్వింగ్‌తో పవర్‌ప్లేలో అమెరికా టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ఈసారి రెండు అరుదైన రికార్డులపై కన్నేసింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆతిథ్య దేశం ఎప్పుడూ కప్పు గెలవలేదు. అలాగే వరుసగా రెండుసార్లు ఏ జట్టూ ఛాంపియన్‌గా నిలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ ఈసారి ఈ రెండు రికార్డులను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. అమెరికా లాంటి పసికూనపై భారీ తేడాతో గెలిచి, రన్ రేట్‌ను పెంచుకోవడమే భారత్ తక్షణ కర్తవ్యం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..