
IND vs SL: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆగస్టు 7 నుంచి శ్రీలంక XI తో టీమిండియా 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ప్రస్తుత భారత టెస్టు స్క్వాడ్ను గమనిస్తే గతంతో పోలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా 9 ఏళ్ల క్రితం 2017లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత 2026 జట్టులో ఏకంగా 14 మార్పులు చోటుచేసుకున్నాయి. పాత స్క్వాడ్ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుత పర్యటనలో కొనసాగుతుండటం విశేషం.
2017 జట్టులోని దిగ్గజాలు.. వారి ప్రస్తుత పరిస్థితి
2017 శ్రీలంక సిరీస్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని 16 మంది సభ్యుల జట్టులో శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శిఖర్ ధావన్, ఛతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహాలు అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అభినవ్ ముకుంద్ 2017 నుంచి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం లేదు.
డ్రాప్ అయిన బౌలర్లు.. దూరమైన ఆల్రౌండర్లు
హార్దిక్ పాండ్యా పూర్తిగా రెడ్ బాల్ క్రికెట్కు దూరమై పరిమిత ఓవర్ల మ్యాచ్లపై మాత్రమే దృష్టి పెట్టగా, అక్షర్ పటేల్ ప్రస్తుత సిరీస్కు ఎంపిక కాలేదు. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలు సుదీర్ఘకాలంగా టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నారు. 2017 స్క్వాడ్ నుంచి కేవలం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రమే 2026 శ్రీలంక పర్యటనలో చోటు దక్కించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..