IND vs SA 4th T20 Toss Delay: భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20టాస్..ఎందుకంత ఆలస్యం? బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇదే

IND vs SA 4th T20 Toss Delay: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో, అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ లక్నోలోని ఇటానా స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే భారీ పొగమంచు కారణంగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టాస్ వేయడంలో తీవ్ర ఆలస్యం జరిగింది.

IND vs SA 4th T20 Toss Delay: భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20టాస్..ఎందుకంత ఆలస్యం? బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇదే
Ind Vs Sa

Updated on: Dec 17, 2025 | 8:50 PM

IND vs SA 4th T20 Toss Delay: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో, అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ లక్నోలోని ఇటానా స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే భారీ పొగమంచు కారణంగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టాస్ వేయడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. వాస్తవానికి, ఈ మ్యాచ్ టాస్ సాయంత్రం 6.30గంటలకు జరగాల్సి ఉంది, కానీ పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. బీసీసీఐ ఈ ఆలస్యంపై తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది.

టాస్ ఆలస్యం కావడంతో బీసీసీఐ మొదట 20 నిమిషాల తర్వాత తనిఖీ ఉంటుందని ప్రకటించింది. 6:50 గంటలకు జరిగిన తొలి తనిఖీ తర్వాత కూడా పొగమంచు అధికంగా ఉండటంతో, రెండో తనిఖీని 7 గంటల 30 నిమిషాలకు నిర్వహించారు. ఆ తర్వాత కూడా అంపైర్లు మ్యాచ్ ప్రారంభించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని భావించారు. అనంతరం 8 గంటలకు మూడో తనిఖీ జరిగింది. అయినా పరిస్థితులు మెరుగుపడలేదు. దీంతో తదుపరి తనిఖీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జరుగుతుందని బీసీసీఐ X ద్వారా అప్‌డేట్ చేసింది. మళ్లీ వీలు పడలేదు.. దీంతో నెక్ట్స్ తనిఖీ రాత్రి 9గంటలకు జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది.

ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి నాలుగో టీ20 మ్యాచ్‌ను గెలుచుకుంటే, భారత్ సిరీస్‌లో అజేయమైన ఆధిక్యాన్ని సాధిస్తుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, అది ఒక చారిత్రక రికార్డు అవుతుంది. ఎందుకంటే సౌతాఫ్రికా జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. ఈ కీలకమైన మ్యాచ్ ప్రారంభం కావడానికి పొగమంచు కారణంగా ఆలస్యం అవుతోంది.

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ రద్దయ్యేందుకు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయడానికి నిర్ణయించిన సమయం రాత్రి 9:46 PM. ఒకవేళ ఈ సమయం లోపు ఒక్క బంతి కూడా వేయకపోతే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తారు. అయితే ఒకవేళ 9:46 PM కి మ్యాచ్ మొదలైనా, అది కేవలం 5 ఓవర్ల చొప్పున జరిగే మ్యాచ్ మాత్రమే అవుతుంది.

సిరీస్‌లో ప్రస్తుతం పరిస్థితి

ఇప్పటికే ఈ 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 3 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ మొదటి మ్యాచ్‌ను కటక్‌లో 101 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దాని తర్వాత, న్యూ చండీగఢ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ధర్మశాలలో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ మళ్లీ పుంజుకుని, దక్షిణాఫ్రికాను 117 పరుగులకే ఆలౌట్ చేసి, 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

నేటి నాలుగో టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించాలని భారత్ అనుకుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేయాలని భావించింది. కానీ లక్నోలో ఏర్పడిన పొగమంచు కారణంగా రెండు జట్లకు నిరాశ ఎదురైంది.

జట్ల వివరాలు

భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, షాబాజ్ అహ్మద్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా.

సౌత్ ఆఫ్రికా జట్టు: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి, ఓట్నీల్ బార్ట్‌మాన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, జార్జ్ లిండే, టోనీ డి జోర్జీ, లూథో సిపమ్లా, క్వేనా మఫాకా.