
Pakistan vs India Match Cancellation: బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించినందుకు నిరసనగా భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే, తటస్థ వేదికలపై మ్యాచ్లు ఆడేందుకు ఇప్పటికే పీసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు దానిని ఉల్లంఘించడం వల్ల ఐసీసీ బోర్డు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి పాక్ భవితవ్యంపై చర్చించనుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయితే బ్రాడ్కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ మొత్తాన్ని పరిహారంగా పీసీబీ చెల్లించాల్సి రావొచ్చని అంటున్నారు.
అలాగే, ఐసీసీ నుంచి పాకిస్థాన్కు అందే వార్షిక ఆదాయ వాటాను రద్దు చేసే అవకాశం ఉంది. పాకిస్థాన్ను టోర్నీ నుంచి పూర్తిగా తప్పించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ, టీ20 ప్రపంచకప్ ఆడతామంటూ పాక్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ జట్టును తప్పించే నిర్ణయం సాధ్యం కాకపోవచ్చు. లేదా ఐసీసీ ఈ ఇష్యూని తీవ్రంగా తీసుకుంటే, ఏదైనా జరగొచ్చు.
పీఎస్ఎల్ (PSL) పై ఆంక్షల ముప్పు.. పాకిస్థాన్కు ప్రధాన ఆదాయ వనరైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) పై ఐసీసీ ఆంక్షలు విధించవచ్చు అని అంటున్నారు. రిటైర్డ్ ఆటగాళ్లు తప్ప, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనకుండా ఎన్ఓసీ (NOC)లను నిలిపివేసే ఛాన్స్ ఉంది. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బగా మారనుంది.
ద్వైపాక్షిక సిరీస్లపై ప్రభావం.. ఒకవేళ పాక్ ఇతర దేశాలతో సిరీస్లు ఆడినా, వాటి ఫలితాలను ఐసీసీ ర్యాంకింగ్స్లో లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లలో లెక్కించకపోవచ్చని సమాచారం. దీనివల్ల పాకిస్థాన్ జట్టు అంతర్జాతీయ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.
రాజకీయ కారణాలతో క్రీడలను బహిష్కరించడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ సంక్షోభంలో పడిపోనుంది. ఐసీసీ సమావేశం అనంతరం వెలువడే తుది నిర్ణయం పాక్ క్రికెట్ భవిష్యత్తును తేల్చనుంది.