Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. గుండు చేయించుకున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఐపీఎల్ ట్రేడ్ విండోకు ముందు ముంబై ఇండియన్స్ నుంచి ఇతర జట్లకు మారనున్నారనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి.

Hardik Pandya: ఏ కోరిక తీరిందని.. తిరుమల శ్రీవారికి పాండ్యా తలనీలాలు సమర్పించాడో తెలుసా?
Hardik Pandya Tirumala

Updated on: Aug 02, 2026 | 5:01 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాడు. దర్శనం అనంతరం సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. గుండు చేయించుకున్న అనంతరం సాంప్రదాయ దుస్తుల్లో ఆలయ పరిసరాల్లో కనిపించిన పాండ్యా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తిరుమలలో భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా లేదా దైవ ఆశీర్వాదం కోసం తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. హార్దిక్ పాండ్యా కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ తలనీలాలు సమర్పించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే పాండ్యా దేవుడిని ఏ కోరిక కోరుకున్నాడు అనే విషయం అందరిలో ఆసక్తికలిగిస్తోంది. అయితే తన వ్యక్తిగత జీవితంలో, అలాగే క్రికెట్ లైఫ్‌లో అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోందని, జరగాలని కోరుకుంటూ పాండ్యా తలనీలాలు సమర్పించుకున్నాడని సమాచారం. వ్యక్తిగత జీవితంతో ప్రశాంతత, అలాగే ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అయినందుకే ఇలా ఆ కలియుగ దైవానికి మొక్కు చెల్లించుకున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాబోయే ఐపీఎల్ ట్రేడ్ విండోకు ముందు ముంబై ఇండియన్స్‌తో ఆయన కొనసాగుతారా లేదా అనే అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టులో మార్పులు ఉండే అవకాశాలపై చర్చ జరుగుతోంది. పలు నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ల మార్పిడి, నగదు పరిహారం కలిపిన ట్రేడ్ ప్రతిపాదనలపై రెండు జట్లు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ తొలుత సీఎస్‌కే ఆటగాళ్లు శివమ్ దూబే, యువ బ్యాటర్ ఆయుష్ మహాత్రేపై ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే మహాత్రేను వదులుకునేందుకు సీఎస్‌కే ఆసక్తి చూపకపోవడంతో, శివమ్ దూబేతో పాటు నగదు పరిహారం కలిగిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చలు జరిగినట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్ పాండ్యా పరిస్థితిని గమనిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ట్రేడ్‌కు సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ లేదా ఆయా ఫ్రాంచైజీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై స్పష్టత రావాలంటే ట్రేడ్ విండో వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us