Hardik Pandya: టీమిండియాలోకి హార్దిక్ రీఎంట్రీ ఖాయం? కానీ గంభీర్ చెప్పిన ఆ షరతు ఏంటంటే!

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హార్దిక్ 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేయలేరని, అంతర్జాతీయ క్రికెట్‌లోకి తొందరగా తీసుకురాబోమని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ఏతో ఇండియా ఏ సిరీస్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే తిరిగి టీమిండియాలో అవకాశం లభించొచ్చని తెలిపారు.

Hardik Pandya: టీమిండియాలోకి హార్దిక్ రీఎంట్రీ ఖాయం? కానీ గంభీర్ చెప్పిన ఆ షరతు ఏంటంటే!
Hardik Pandya (2)

Updated on: Sep 18, 2026 | 2:01 PM

Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొద్ది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ మీద ఒక అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత పెద్దగా పోటీ క్రికెట్ ఆడದ హార్దిక్, త్వరలో జరగబోయే ఇండియా ‘ఎ’ వర్సెస్ ఆస్ట్రేలియా ‘ఎ’ వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సిరీస్‌లో హార్దిక్ ప్రదర్శనే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని కోచ్ స్పష్టం చేశారు.

ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే ఛాన్స్

ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకున్న అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తిస్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉందని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లోకి తొందరపడి తీసుకొచ్చి అతనిపై భారం మోపాలని కోచింగ్ సిబ్బంది భావించడం లేదని, ముందుగా దేశవాళీ లేదా ‘ఎ’ టీమ్ మ్యాచ్‌లలో సత్తా చాటాలని స్పష్టం చేశారు.

ఇండియా ‘ఎ’ సిరీస్‌పైనే అందరి చూపు

అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఇండియా ‘ఎ’ – ఆస్ట్రేలియా ‘ఎ’ వన్డే సిరీస్ కోసం హార్దిక్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ అక్టోబర్ 11తో ముగియనుంది. ఒకవేళ హార్దిక్ కనుక ఈ మ్యాచ్‌లలో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే, ఆ వెంటనే అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అతను దూరమైనప్పటికీ, త్వరలోనే రీఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.

జట్టు బ్యాలెన్సింగ్ కోసం హార్దిక్ అవసరం

దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాత్ర ఎంతో కీలకమని గంభీర్ అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉంటే టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని, తద్వారా జట్టుకు అదనపు బలం చేకూరుతుందని కోచ్ ధీమా వ్యక్తం చేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us