
Gautam Gambhir : సౌతాఫ్రికా పై భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన తరువాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జట్టు టెస్ట్ క్రికెట్ ప్రదర్శనపై వస్తున్న విమర్శల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ మ్యాచ్లలో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని ఒప్పుకున్నప్పటికీ, ఇటీవల జట్టు అంశాలపై స్ప్లిట్ కోచింగ్ సిస్టమ్ను సూచించిన ఒక ఐపీఎల్ జట్టు యజమానిపై గంభీర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల భారత్ టెస్ట్ సిరీస్లో 0-2తో ఓడిపోయిన తరువాత ప్రత్యేక రెడ్-బాల్ కోచ్ను సూచించిన ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ను ఉద్దేశిస్తూనే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.
ఐపీఎల్ యజమానిపై గంభీర్ ఫైర్
వన్డే సిరీస్ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన గంభీర్ క్రికెట్కు సంబంధం లేని వ్యక్తులు జట్టు అంశాలపై వ్యాఖ్యానించడం సరికాదని స్పష్టం చేశారు. టెస్ట్ సిరీస్ ఓటమికి, గాయం కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేయలేకపోవడం కూడా ఒక ముఖ్య కారణమని గంభీర్ పేర్కొన్నారు. గంభీర్ మాట్లాడుతూ.. “ఎవరూ ఈ విషయం (గిల్ ఆడకపోవడం) గురించి మాట్లాడలేదు. చర్చలన్నీ పిచ్, ఇతర అంశాల గురించే ఉన్నాయి. క్రికెట్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. క్రికెట్కు ఏమాత్రం సంబంధం లేని ఒక ఐపీఎల్ జట్టు యజమాని కూడా స్ప్లిట్ కోచింగ్ స్టాఫ్ గురించి రాశారు. ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో ఉండాలి. నేను ఇతరుల పరిధిలోకి వెళ్లనప్పుడు వారికి కూడా నా పరిధిలోకి రావడానికి హక్కు లేదు” అంటూ గంభీర్ తీవ్రంగా స్పందించారు.
గిల్ ఫిట్నెస్పై అప్డేట్
టెస్ట్ సిరీస్ ఓటమి గురించి మాట్లాడుతూ.. శుభ్మన్ గిల్ లేకపోవడంపై విమర్శకులు దృష్టి పెట్టకుండా పిచ్, ఇతర అంశాలపై దృష్టి పెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని గంభీర్ అన్నారు. అయితే రాబోయే ఐదు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్కు శుభ్మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడని గంభీర్ ధృవీకరించారు. “శుభ్మన్ రెడీగా ఉన్నాడు. అందుకే అతన్ని సెలక్ట్ చేశాం. అతను ఫిట్గా ఉన్నాడు. పనిచేయడానికి, మెరుగుపరచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఈ జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు” అని గంభీర్ తెలిపారు.