IND vs ENG 4th Test : శుభ్‌మన్ గిల్ టీమ్‌కు సవాల్.. నాలుగో టెస్టుకు ముందే కీలక ప్లేయర్లు ఔట్

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. నాలుగో టెస్ట్ జూలై 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. కీలకమైన మ్యాచ్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయపడటం టీమ్ ఇండియాకు పెద్ద ఆందోళన కలిగించే విషయం. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనే జట్టు సత్తా ఏంటో బయటపడుతుంది.

IND vs ENG 4th Test : శుభ్‌మన్ గిల్ టీమ్‌కు సవాల్.. నాలుగో టెస్టుకు ముందే కీలక ప్లేయర్లు ఔట్
Ind Vs Eng 4th Test

Updated on: Jul 20, 2025 | 10:56 AM

IND vs ENG 4th Test : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. నాలుగో టెస్ట్ జూలై 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో అజేయ ఆధిక్యం సాధించాలని ఇంగ్లాండ్ చూస్తోంది. అయితే, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టుకు ఈ డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ అర్ష్‌దీప్ సిం ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలాగే, ఆకాష్ దీప్ ఆడే విషయంపై కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. అర్ష్‌దీప్ సింగ్ నాలుగో టెస్టుకు అందుబాటులో లేడు. ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని వేలికి లోతైన గాయం అయ్యింది. దానికి కుట్లు కూడా వేశారు. అర్ష్‌దీప్ నాలుగో టెస్టులో అరంగేట్రం చేయవచ్చని తొలుత భావించారు.

“అర్ష్‌దీప్ సింగ్ చేతికి లోతైన గాయం అయ్యింది, దానికి కుట్లు వేశారు. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పడుతుంది” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకే సెలక్టర్లు అతని స్థానంలో అంశుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన ఆకాష్ దీప్ సింగ్ నాలుగో టెస్టులో ఆడేది ఇంకా ఖరారు కాలేదు. అతనిపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. అతను నడుము నొప్పితో బాధపడుతున్నాడని నివేదిక తెలిపింది. మాంచెస్టర్‌కు బయలుదేరే ముందు జరిగిన భారత ప్రాక్టీస్ సెషన్‌లో కూడా అతను పాల్గొనలేదు. ఈ పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా పాత్ర చాలా కీలకంగా మారింది. వాస్తవానికి, అతను మొదటి, మూడవ, ఐదవ టెస్టులు మాత్రమే ఆడతాడని ముందుగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు నాలుగో టెస్ట్ డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో, బుమ్రా తన ప్రణాళికను మార్చుకుని మాంచెస్టర్‌లో ఆడతాడా లేదా అనేది చూడాలి.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత్ మొదటి టెస్టులో అద్భుతంగా ఆడినప్పటికీ, ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులో టీమ్ ఇండియా తిరిగి పుంజుకుని 336 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మూడో టెస్టులో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో గెలిస్తే సిరీస్‌లో అజేయ ఆధిక్యం సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా, భారత్ సిరీస్ గెలిచే ఆశలు సన్నగిల్లుతాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..