
RCB Celebration Tragedy : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై పోలీసులు, ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్సీఏ) లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా, పోలీసు అధికారులపై విభాగాపరమైన ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై జస్టిస్ డి. మైఖేల్ కున్హా నేతృత్వంలోని వన్ మ్యాన్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఈ నివేదిక ఆధారంగా ఆర్సీబీ, డీఎన్ఏ, కేఎస్సీఏ లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కున్హా నివేదికలో సిఫార్సు చేయబడింది.
మంత్రివర్గం క్రిమినల్ కేసుల నమోదుకు నిర్ణయం తీసుకోవడంతో, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ అధ్యక్షుడు రఘురామ్ భట్, మాజీ కార్యదర్శి ఎ. శంకర్, మాజీ కోశాధికారి జయరామ్, ఆర్సీబీ జట్టుకు చెందిన రాజేష్ మీనన్, డీఎన్ఏ నెట్వర్క్ లిమిటెడ్ ఎండీ వెంకట్ వర్ధన్, డీఎన్ఏ నెట్వర్క్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు సునీల్ మాతూర్ లకు కష్టాలు తప్పవు.
అంతేకాకుండా బెంగళూరు నగరం మాజీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్, ఐపీఎస్ అధికారులు వికాస్ కుమార్ వికాస్, శేఖర్, కబ్బన్ పార్క్ సబ్-డివిజన్ ఏసీపీ బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గిరీష్ లపై కూడా కేసులు నమోదు కానున్నాయి.
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనలో మరణించిన ప్రజ్వల్ తల్లి ఆక్రోశం వ్యక్తం చేస్తూ, “విరాట్ కోహ్లీ ఏమైనా దేవుడా?” అంటూ ప్రశ్నించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..