IND Vs ENG: ఓడిపోయినా.. చివరి వరకు పోరాడాం.! పోతూ.. పోతూ.. టీమిండియాపై ఇంగ్లాండ్ కోచ్ ఏమన్నాడంటే

టీమిండియా చేతిలో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ ఓటమిపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ స్పందించారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన, ముఖ్యంగా బుమ్రా స్పెల్, అలాగే జాకబ్ బేతల్ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పాయని ఆయన పేర్కొన్నారు. చివరి వరకు పోరాడినప్పటికీ, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు.

IND Vs ENG: ఓడిపోయినా.. చివరి వరకు పోరాడాం.! పోతూ.. పోతూ.. టీమిండియాపై ఇంగ్లాండ్ కోచ్ ఏమన్నాడంటే
Ind Vs Eng

Updated on: Mar 06, 2026 | 9:50 AM

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఏడు పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బేతల్ టీం ఇండియా బౌలర్లపై చివరి వరకు ధైర్యంగా పోరాడాడు. అయితే, మ్యాచ్ చివరి దశలో భారత బౌలర్లు పరుగులను నియంత్రించడంలో, కీలక వికెట్లు తీయడంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుమ్రా ఓవర్‌లోనే జాకబ్ బేతల్ రనౌట్ అవ్వడం ఇంగ్లాండ్‌కు చావుదెబ్బగా మారింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయడమే కాకుండా, సెంచరీ వీరుడైన జాకబ్ బేతల్‌ను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ ఫీల్డింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టీం ఇండియా విజయానికి దోహదపడ్డాడు.

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తమ జట్టు ఓటమిపై స్పందించారు. “మేము విజయం కోసం చివరి వరకు పోరాడాం. చివరి ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడమే మా ఓటమికి ప్రధాన కారణం” అని ఆయన పేర్కొన్నారు. మ్యాచ్ ఆరంభంలో బ్రూక్ వదిలేసిన క్యాచ్ టీం ఇండియా భారీ స్కోర్‌కు పునాది వేసిందని, అలాగే చివరి దశలో బౌలింగ్‌లో టీం ఇండియా అద్భుతంగా పుంజుకుందని మెక్‌కలమ్ విశ్లేషించారు. వరుస విరామాలతో వికెట్లను కోల్పోవడమే కాకుండా, జాకబ్ బేతల్ రనౌట్ అవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని, అక్కడే తమ ఓటమి ఖరారు అయిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం చాలా కష్టంగా మారిందని, అతని స్పెల్ తమ ఓటమిని శాసించిందని బ్రెండన్ మెక్‌కలమ్ పేర్కొన్నారు.

తమ జట్టు కుర్రాడు జాకబ్ బేతల్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను మెక్‌కలమ్ కొనియాడారు. అతడు ఎంతటి గొప్ప ఆటగాడో మరోసారి ప్రపంచానికి తెలిసిందని మెక్‌కలమ్ అన్నారు. 250 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పటికీ, తమ జట్టు చివరి వరకు పోరాడిందని మెక్‌కలమ్ పేర్కొన్నారు. ఓడిపోయినప్పటికీ, తమ జట్టు చూపించిన ధైర్యం చూసి తాను గర్వపడుతున్నానని తెలిపారు. “టీం ఇండియా సొంత గడ్డపై ఇలా చెలరేగుతుందని మేము ముందే ఊహించాం. అయితే, అంచనాలను అందుకునే క్రమంలో చివరికి బోల్తా పడ్డాం” అని బ్రెండన్ మెక్‌కలమ్ తమ నిరాశను వ్యక్తం చేశారు. మొత్తంమీద, భారత బౌలర్ల వ్యూహాత్మక ప్రదర్శన, కీలక సమయాల్లో వికెట్లు తీయడం, అలాగే ఫీల్డింగ్ మెరుపులే ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

Follow Us