Suryakumar Yadav : ప్రపంచకప్ గెలిపించినా కెప్టెన్సీ నుంచి అవుట్.. సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

Suryakumar Yadav : ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వైఫల్యం తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో ఫామ్ నిరూపిస్తే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశముంది.

Suryakumar Yadav : ప్రపంచకప్ గెలిపించినా కెప్టెన్సీ నుంచి అవుట్.. సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
Suryakumar Yadav

Updated on: Jul 13, 2026 | 3:44 PM

Suryakumar Yadav : క్రికెట్ ప్రపంచంలో ఒక కెప్టెన్ తన జట్టుకు ప్రపంచకప్ అందిస్తే.. ఆ తర్వాత అతనికి బ్రహ్మరథం పడతారు. కానీ భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో మాత్రం కథ అడ్డం తిరిగింది. టీమిండియాకు టి20 ప్రపంచకప్ 2026 అందించి హిస్టరీ క్రియేట్ చేసిన కొద్ది రోజులకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి సెలెక్టర్లు ఊహించని విధంగా తొలగించారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. అయితే, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పోయినప్పటికీ ఒక ఆటగాడిగా మళ్లీ టీ20ల్లోకి కంబ్యాక్ ఇచ్చేందుకు బీసీసీఐ తలుపులు తెరిచినట్లు తెలుస్తోంది.

నిజానికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ మ్యాచ్‌లు గెలిచినప్పటికీ, గత కొంతకాలంగా అతని వ్యక్తిగత ఫామ్ తీవ్రంగా దెబ్బతింది. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా సూర్య వరుసగా విఫలమయ్యాడు. 2025 సీజన్‌లో ఆడిన 21 టీ20ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా నిరాశపరిచాడు. అలాగే 2026 ఐపీఎల్‌లోనూ 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వయసు పైబడుతుండటంతో అతనిలో పాత ఫుట్ వర్క్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ లోపించాయని విమర్శలు వచ్చాయి. 2028 టీ20 ప్రపంచకప్ నాటికి సూర్యకు 37 ఏళ్లు వస్తాయి కాబట్టి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ అతనిపై వేటు వేసింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌కు పూర్తిగా ఎండ్ కార్డ్ వేయలేదు. అయితే, జట్టులోకి తిరిగి రావాలంటే సెలెక్టర్లు అతనికి ఒక కండిషన్ పెట్టారు. సూర్యకుమార్ దేశవాళీ క్రికెట్‎తో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున భారీగా పరుగులు సాధించి తన ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. గతంలో యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ వంటి సీనియర్ ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి ఎలాగైతే టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చారో, అదే ఫార్ములాను సూర్య కూడా ఫాలో అవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ టూర్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలం కావడంతో సూర్య అనుభవం జట్టుకు అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నారు.

ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకుని జట్టులోకి వస్తే.. ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేస్తున్న ముగ్గురు ఆటగాళ్ల స్థానాలకు ఎసరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. వారిలో మొదటి పేరు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్. ఇంగ్లాండ్ పర్యటనలో సంజూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అవ్వడంతో జట్టు నుంచి డ్రాప్ చేశారు. రెండో ఆటగాడు తిలక్ వర్మ. టీ20 వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఆసియా కప్ తర్వాత అతని స్ట్రైక్ రేట్ బాగా పడిపోయింది. ఇక మూడో ఆటగాడు శివమ్ దూబే. దూబే వయసు కూడా పెరుగుతుండటం, ఇటీవలి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ కనుక ఫామ్ లోకి వస్తే ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us