Team India Injuries : గాయం నుంచి కోలుకోకముందే ఫిట్ సర్టిఫికెట్? బీసీసీఐపై పెరుగుతున్న విమర్శలు

Team India Injuries : టీమిండియా ఆటగాళ్ల వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. హర్షిత్ రాణా ఫిట్‌నెస్ క్లియరెన్స్, జస్ప్రీత్ బుమ్రా గాయం, స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టుతో CoE వ్యవస్థపై తీవ్ర చర్చ మొదలైంది.

Team India Injuries : గాయం నుంచి కోలుకోకముందే ఫిట్ సర్టిఫికెట్? బీసీసీఐపై పెరుగుతున్న విమర్శలు
Team India

Updated on: Aug 06, 2026 | 3:15 PM

Team India Injuries : బీసీసీఐ ఆటగాళ్ల గాయాలను నిర్వహించడానికి వారి రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ కేంద్రం పనితీరుపై తీవ్రస్థాయిలో అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సెలెక్టర్లు, CoE స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడం వల్లే వరుసగా ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారని, సరైన ఫిట్‌నెస్ లేకుండానే జట్టులోకి వస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హర్షిత్ రాణా అధిక బరువు వివాదం

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోకాలి గాయం, శస్త్రచికిత్స అనంతరం రీ-ఎంట్రీ ఇచ్చిన రాణాకు ఆ వెంటనే హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యే సమయానికి హర్షిత్ రాణా బరువు ఏకంగా 97 కిలోలుగా ఉంది. CoE నిపుణులు అతని బరువు 96 కిలోలకు మించకుండా చూడాలని సూచించినప్పటికీ, ఓవర్ వెయిట్‌తో ఉన్న అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే హ్యామ్‌స్ట్రింగ్ గాయం తిరగతోడిందని టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం అతని బరువు 94 కిలోలకు తగ్గడంతో వచ్చే వారం క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది.

జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక పర్యటనకు దూరం

మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం డ్రామా కూడా CoE వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఐపీఎల్ 2026 తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన బుమ్రా, ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. శ్రీలంక పర్యటన సమయానికి బుమ్రా పూర్తిగా ఫిట్ అవుతాడని సెలెక్టర్లకు CoE బృందం హామీ ఇచ్చినప్పటికీ, ప్రయాణ సమయానికి అతను ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో లంక పర్యటన నుంచి అతను వైదొలగాల్సి వచ్చింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

హెడ్ లేని స్పోర్ట్స్ సైన్స్ విభాగం

ప్రస్తుతం బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి అధికారికంగా ఎటువంటి హెడ్ లేదా అధిపతి లేకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ కీలకమైన పోస్టు ఖాళీగా ఉండటంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోజువారీ కార్యకలాపాలు, రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్ అమలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆటగాళ్లు అధిక బరువుతో ఉన్నప్పుడు, గాయాల నుంచి పూర్తిగా కోలుకోనప్పుడు వారికి ఏ ప్రాతిపదికన ఫిట్ అని సర్టిఫికెట్ ఇస్తున్నారో అర్థం కాక సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us