
మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వచ్చిన ఆస్ట్రేలియా టీమ్కు బంగ్లా పులులు ఊహించని షాకిచ్చారు. తొలి వన్డేలో చిత్తుగా ఓడించేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టార్టింగ్లోనే ఒక వికెట్ కోల్పోయినా.. ఓపెనర్ హసన్ తమీమ్ 54, నజ్ముల్ షాంటో 67 పరుగులతో బంగ్లాదేశ్కు మంచి ఆరంభం అందించారు. చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మొసద్దెక్ హుస్సేన్ 70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 86 పరుగుుల చేసి, ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మొత్తంగా 50 ఓవర్లు పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియా ముందు బంగ్లాదేశ్ ఓ మంచి టార్గెట్ అయితే ఉంచిది.
సాధారణంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చూసి.. ఈ స్కోర్ను సింపుల్గా ఛేజ్ చేస్తుందని అనిపించిది. కానీ, అక్కడుంది బంగ్లా పులులు, ఆడుతోంది వారి సొంత గడ్డపై అంత తేలిగ్గా వదిలేస్తారా? అయినా బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికీ పసికూనే అయినప్పటికీ, వారి సొంత గ్రౌండ్స్లో మాత్రం పెద్ద పులే. 285 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను బంగ్లా బౌలర్లు వణికించారు. ముఖ్యంగా నహిద్ రాణా అయితే ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతని ధాటికి ఆస్ట్రేలియా కేవలం 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్లో 80కి పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది ఆస్ట్రేలియాకు ఒక రకంగా తీవ్ర అవమానమే.
కానీ ఇక్కడ బంగ్లా బౌలర్లను ఎంత మెచ్చుకున్న తక్కువే. అద్భుతమైన బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. నహిద్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, టస్కిన్ అహ్మద్ 1, ముస్తఫిజుర్ రహెమన్ 2, మొసద్దెక్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు. మొత్తంగా 42.2 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి ఆస్ట్రేలియా 191 పరుగులు చేసి తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ 86 పరుగులతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు వన్డేల సిరీస్లో ఇప్పుడు బంగ్లా 1-0తో ముందంజలో ఉంది. మరి తర్వాత మ్యాచ్లలోనైనా ఆస్ట్రేలియా గెలిచి బంగ్లాకు సమాధానం ఇస్తుందో.. లేదో సొంత గడ్డపై పెద్ద పులుల్లా ఆడే బంగ్లా ముందు తలవంచుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి