
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. తాజాగా జపాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కేవలం 57 పరుగులకే జపాన్ ఇన్నింగ్స్ను చుట్టేసిన భారత జట్టు, ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కేవలం 30 బంతుల్లోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత అమ్మాయిలు ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్లోకి అధికారికంగా ప్రవేశించారు.
అదరగొట్టిన శ్రీచరణి
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ నిర్ణయాన్ని బౌలర్లు అద్భుతంగా నిరూపించారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ను ప్రదర్శిస్తూ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. జపాన్ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తం ఇన్నింగ్స్లో జపాన్ జట్టు కేవలం మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగింది. మరోవైపు పార్ట్-టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ కూడా 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఇద్దరు రన్ అవుట్ రూపంలో వెనుదిరిగారు. దీంతో జపాన్ జట్టు కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.
షెఫాలి వర్మ విధ్వంసకర బ్యాటింగ్
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలి వర్మ మొదటి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 40 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. మరో ఎండ్లో రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. దీంతో భారత జట్టు కేవలం 30 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..