Team India : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో వెనుకబడ్డ భారత్.. టెస్టుల్లో అసలు సిసలు పరీక్ష అక్కడే

Team India : సొంతగడ్డపై వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడి, చరిత్రలో మూడుసార్లు ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టు గా రికార్డు సృష్టించిన భారత్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ నంబర్ వన్ కావాలని పట్టుదలతో ఉంది.

Team India : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో వెనుకబడ్డ భారత్.. టెస్టుల్లో అసలు సిసలు పరీక్ష అక్కడే
Wtc Final Scenario

Updated on: Mar 11, 2026 | 8:28 PM

Team India : టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియా, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంపై కన్నేసింది. సొంతగడ్డపై వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడి, చరిత్రలో మూడుసార్లు ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన భారత్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ నంబర్ వన్ కావాలని పట్టుదలతో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యంగా శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. గతంలో రెండుసార్లు ఫైనల్‌కు చేరి తృటిలో చేజార్చుకున్న భారత్, ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ జట్టు ప్రదర్శనపై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమిండియా ఎదురుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందని కోటక్ అభిప్రాయపడ్డారు. గిల్ గాయం కారణంగా రెండో టెస్టుకు కూడా దూరం కావాల్సి వచ్చింది. దీంతో సౌతాఫ్రికా చేతిలో భారత్ క్లీన్ స్వీప్ అవ్వాల్సి వచ్చింది. “ఓటమిని మేము అంగీకరిస్తున్నాము, ఆ సమయంలో మేము ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే మా ఆటగాళ్లు యంత్రాలు కాదు, మనుషులు.. అప్పుడప్పుడు ప్రదర్శన తగ్గడం సహజం. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి అవసరమైన దారిని మేము కచ్చితంగా వెతుక్కుంటాం” అని కోటక్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది టెస్టుల్లో నాలుగింటిని గెలిచిన భారత్, మరో నాలుగింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం గెలుపు శాతం 48.15గా ఉంది. స్వదేశంలో వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన గిల్ సేన, ఇంగ్లండ్‌లో సిరీస్‌ను డ్రా చేసుకుంది. రాబోయే జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు డబ్ల్యూటీసీలో భాగం కాకపోయినా, అది శ్రీలంక పర్యటనకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని జట్టు భావిస్తోంది. తదుపరి సిరీస్ శ్రీలంకతో (పట్టికలో 4వ స్థానం) జరగనుండగా, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో (పట్టికలో 2వ స్థానం) భారత్ తలపడనుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ రాబోయే సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో, 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, మూడోసారి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలని చూస్తోంది. ముఖ్యంగా కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్, విదేశీ గడ్డపై బ్యాటింగ్ ప్రదర్శనపై కోచ్‌లు ప్రత్యేక దృష్టి సారించారు. గిల్ కెప్టెన్సీలో యువ రక్తం ఉరకలేస్తున్న టీమిండియా, టీ20ల జోరును టెస్టుల్లోనూ కొనసాగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us