Abhishek Sharma : అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్

Abhishek Sharma : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన పవర్ ఏంటో చూపించాడు. సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సిక్సర్ల సునామీ సృష్టించాడు.

Abhishek Sharma : అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్
Abhishek Sharma Sanju Samson

Updated on: Feb 27, 2026 | 5:02 PM

Abhishek Sharma : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన పవర్ ఏంటో చూపించాడు. సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు డకౌట్ (0) అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్, సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చి అందరి నోళ్లు మూయించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు బాదాడు. ఇందులో 4 ఫోర్లు, 4 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో అతనికి ఇది మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

అభిషేక్ శర్మ ఇలా ఒక్కసారిగా గాడిలో పడటం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వేసిన ఒక తెలివైన మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అభిషేక్ ఫామ్ చాలా దారుణంగా ఉండేది. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్నర్లను రంగంలోకి దింపి అతడిని కట్టడి చేసేవి. అయితే ఈసారి గంభీర్-సూర్య ద్వయం ఒక వ్యూహాన్ని మార్చారు. ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి, సంజూ శామ్సన్‌ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా నేరుగా ఓపెనింగ్‌కు పంపారు. దీనివల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కుదిరి జింబాబ్వే కెప్టెన్ లెక్కలు తలకిందులయ్యాయి.

సాధారణంగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఓపెనింగ్ చేస్తే ప్రత్యర్థులు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ మొదలుపెడతారు. కానీ ఈసారి రైట్ హ్యాండర్ అయిన సంజూ శామ్సన్ క్రీజులోకి రావడంతో జింబాబ్వే ఆ సాహసం చేయలేకపోయింది. సంజూ స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడు కాబట్టి, వారు పేసర్లను దించక తప్పలేదు. పేస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడటంలో అభిషేక్ సిద్ధహస్తుడు. సరిగ్గా ఇదే జరిగింది. సంజూ శామ్సన్ 15 బంతుల్లోనే 24 పరుగులు చేసి మంచి పునాది వేయగా, అభిషేక్ తన దూకుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి మధ్య కుదిరిన 48 పరుగుల భాగస్వామ్యం ఈ టోర్నీలో భారత్‌కు అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్.

పవర్ ప్లే ముగిసేసరికి భారత్ ఏకంగా 80 పరుగులు చేసింది. ఈ అదిరిపోయే ఆరంభం వల్లే టీమిండియా 256 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం, సంజూ శామ్సన్ మెరుపులు మెరిపించడం చూస్తుంటే గంభీర్ వ్యూహం నూటికి నూరు శాతం ఫలించిందని అర్థమవుతోంది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేసింది. సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌ల ముందు అభిషేక్ బ్యాట్ ఝుళిపించడం భారత అభిమానులకు పెద్ద ఊరటనిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us