Ranji Trophy Final : భారత క్రికెట్‌లో పెను సంచలనం.. 67 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్

Ranji Trophy Final : భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, తొలిసారి ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ అద్భుత విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Ranji Trophy Final : భారత క్రికెట్‌లో పెను సంచలనం.. 67 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్
Jammu And Kashmir Ranji Trophy Final

Updated on: Feb 18, 2026 | 2:59 PM

Ranji Trophy Final : భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, తొలిసారి ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ పోరులో బలమైన బెంగాల్ జట్టును 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కీర్తి కిరీటంలో మరో మెరిసే వజ్రాన్ని చేర్చింది. ఈ అద్భుత విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ చారిత్రక విజయంలో జమ్మూ కాశ్మీర్ స్టార్ ప్లేయర్ ఆకిబ్ నబీ దార్ హీరోగా నిలిచాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు.. ఇలా మొత్తంగా మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టి బెంగాల్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం బంతితోనే కాకుండా, బ్యాట్‌తోనూ మెరిసి తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 42 పరుగులు జోడించాడు. బెంగాల్ తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలడంతో జమ్మూ కాశ్మీర్‌కు 126 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది.

లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్లు ఎంతో క్రమశిక్షణతో ఆడారు. ముఖ్యంగా వంశజ్ శర్మ తన సహనాన్ని కోల్పోకుండా ఆడి 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్టార్ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించడం మ్యాచ్‌కే హైలైట్. అతనికి అబ్దుల్ సమద్ (30 బంతుల్లో 27 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. బెంగాల్ వంటి రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టును ఓడించడం జమ్మూ కాశ్మీర్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

ఈ సీజన్ మొత్తం జమ్మూ కాశ్మీర్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై గెలిచినప్పుడు కూడా ఆకిబ్ నబీ తన ప్రతాపం చూపాడు. ఆ మ్యాచ్‌లో అతను ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఇప్పుడు ఫైనల్లో కర్ణాటక లేదా ఉత్తరాఖండ్‌తో తలపడేందుకు జమ్మూ కాశ్మీర్ సిద్ధమవుతోంది. లోయలో క్రికెట్ ప్రమాణాలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఈ విజయమే నిదర్శనం. ఆటగాళ్ల కఠోర శ్రమ, పట్టుదల ఈరోజు వారిని ఫైనల్ మెట్లపై నిలబెట్టాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us