
Arjuna Awards 2025 Winners: భారత క్రీడారంగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ మంగళవారం అర్జున అవార్డులను ప్రకటించింది. తేజస్విన్ శంకర్, చెస్ స్టార్ దివ్య దేశ్ముఖ్, బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించారు. దేశం తరపున అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన యోధులకు ఈ గుర్తింపు దక్కింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విడుదలైన ఈ జాబితాలో మొత్తం 17 మంది క్రీడాకారులు ఉన్నారు. దశాబ్దాలుగా భారత క్రీడారంగానికి సేవలు అందించిన సీనియర్లతో పాటు ఇటీవల కాలంలో మెరుపులు మెరిపించిన యువ తారలకూ ఈ జాబితాలో సముచిత స్థానం లభించింది.
వివిధ క్రీడా విభాగాల నుంచి ఎంపికైన క్రీడాకారుల జాబితాలో చెస్ రంగానికి చెందిన పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ కప్ సాధించిన చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ తో పాటు గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
బ్యాడ్మింటన్ విభాగంలో మహిళల డబుల్స్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న తెలుగు తేజం గాయత్రి గోపీచంద్, ఆమె భాగస్వామి ట్రీసా జాలీ లకు సంయుక్తంగా ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ టోర్నీలలో వీరిద్దరూ ప్రదర్శించిన నిలకడైన ఆటతీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది.
కామన్వెల్త్ క్రీడల్లో డెకథ్లాన్ విభాగంలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తేజస్విన్ శంకర్ ఈసారి అవార్డు విజేతల జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత, బాక్సర్ నరేందర్ కూడా పురస్కారానికి ఎంపికయ్యాడు. బధిరుల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు సైతం అర్జున అవార్డు దక్కడం గమనార్హం.
తేజస్విన్ శంకర్ – అథ్లెటిక్స్
మహమ్మద్ అజ్మల్ వి – అథ్లెటిక్స్
ప్రియాంక గోస్వామి – అథ్లెటిక్స్
ట్రీసా జాలీ – బ్యాడ్మింటన్
పుల్లెల గాయత్రీ గోపీచంద్ – బ్యాడ్మింటన్
నరేందర్ – బాక్సింగ్
విదిత్ సంతోష్ గుజరాతీ – చెస్
దివ్య జితేంద్ర దేశ్ముఖ్ – చెస్
ధనుష్ శ్రీకాంత్ – డెఫ్ షూటింగ్ (బధిరుల షూటింగ్)
లాల్రెమ్సియామి – హాకీ
రాజ్కుమార్ పాల్ – హాకీ
సుర్జీత్ – కబడ్డీ
పూజా – కబడ్డీ
రుద్రాంశ్ ఖండేల్వాల్ – పారా-షూటింగ్
ఏక్తా భయాన్ – పారా అథ్లెటిక్స్
అరవింద్ సింగ్ – రోయింగ్
అఖిల్ షెరాన్ – షూటింగ్
ఐ. అరుమై నాయగం – ఫుట్బాల్
పర్వీర్ సింగ్ – అథ్లెటిక్స్
ఛోటే లాల్ యాదవ్ – బాక్సింగ్
నేహా నందకుమార్ చవాన్ – షూటింగ్
ధర్మేంద్ర సింగ్ యాదవ్ – బాక్సింగ్
వీరేందర్ కుమార్ – రెజ్లింగ్ (కుస్తీ)
ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే –(Sports Promotion and Development)
గత చరిత్రను గౌరవిస్తూ సీనియర్ క్రీడాకారుడిని కూడా కేంద్రం గుర్తించింది. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్బాల్ జట్టు సభ్యుడు ఐ. అరుమై నాయగం ను లైఫ్టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ కింద అర్జున అవార్డుతో సత్కరించనున్నారు. దేశానికి చారిత్రక విజయాన్ని అందించిన దిగ్గజానికి దక్కిన ఈ గౌరవం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ విభాగాల్లో దేశ ప్రతిష్టను పెంచిన 17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డు దక్కడం క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అత్యున్నత ఖేల్ రత్న అవార్డు లేకపోవడం స్వల్ప నిరాశ కలిగించినా, యువ ప్రతిభావంతులతో పాటు అలనాటి దిగ్గజానికి దక్కిన గుర్తింపు భారత క్రీడారంగానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.