
కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠ వాసం అని భక్తుల నమ్మకం. అందుకనే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తారు. అయితే శ్రీవారి భక్తులను ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి, తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుని కల్పించనున్నామని చెప్పారు. గత కొంత కాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వలన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికట్టవచ్చునని భావిస్తున్నామని చెప్పారు.
తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు.. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. తిరుమల కొండపై APSRTC ద్వారా రోజూ ఫ్రీగా 150 ట్రిప్పులు తిప్పాలని ప్రతిపాదన పంపినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు వస్తాయన్నారు. టిటిడి ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఎపిఎస్ఆర్టిసి బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..