
Delhi Akshardham: ఢిల్లీలోని అక్షర్ధామ్ వేదికగా రేపు (మార్చి 26) ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఒకే కాలుపై నిలబడి ఉన్న భగవాన్ స్వామినారాయణ్ (నీలకంఠ వర్ణి) విగ్రహాన్ని మహంత్ స్వామి మహారాజ్ ప్రతిష్ఠించనున్నారు. ఈ చారిత్రక వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అక్షర్ధామ్లో కొలువుదీరనున్న 108 అడుగుల ‘నీలకంఠ వర్ణి’ తపోమూర్తి:
భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్ధామ్ మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. తీవ్రమైన తపస్సును ప్రతిబింబించేలా, ఒకే కాలుపై నిలబడి ఉన్న 108 అడుగుల భారీ ‘నీలకంఠ వర్ణి’ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మార్చి 26న అత్యంత వైభవంగా జరగనుంది.
కేవలం 11 ఏళ్ల వయసులోనే భగవాన్ స్వామినారాయణ తన ఇంటిని వదిలి, మానవాళి కల్యాణం కోసం దేశవ్యాప్త ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. ఏడేళ్ల కాలంలో సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి హిమాలయాలు, బద్రీనాథ్, కేదార్నాథ్, ముక్తినాథ్ (నేపాల్), రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఈ యాత్ర సమయంలో ఆయనను ‘నీలకంఠ వర్ణి’ అని పిలిచేవారు. నేపాల్లోని పుల్హాశ్రమం (ముక్తినాథ్) వద్ద ఆయన ఆహారం, నీరు లేకుండా నాలుగు నెలల పాటు ఒకే కాలుపై నిలబడి చేసిన కఠిన తపస్సుకు గుర్తుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.
Delhi Akshardham
ఈ వేడుక కోసం అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల నుంచి 300 మందికి పైగా సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు తరలివచ్చారు. లండన్, న్యూయార్క్, దుబాయ్, సిడ్నీ, హాంగ్కాంగ్ వంటి నగరాల నుంచి వేలాది మంది భక్తులు ఢిల్లీకి చేరుకున్నారు.
Delhi Akshardham
మార్చి 25 ఉదయం అక్షర్ధామ్ ప్రాంగణంలో ‘శ్రీ నీలకంఠ వర్ణి ప్రపంచ శాంతి మహాయజ్ఞం’ వైదిక పద్ధతిలో ప్రారంభమైంది. బి.ఎ.పి.ఎస్ (BAPS) సంస్థ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవాలని, ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతికి చిహ్నంగా ఆయన ఆకాశంలోకి తెల్లని పావురాలను వదిలారు.
మార్చి 26, ఉదయం 6:00 గంటలకు ప్రధాన విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు ప్రారంభం. అనంతరం భక్తుల దర్శనం కోసం విగ్రహావిష్కరణ ఉండనుంది. ఈ విగ్రహం కేవలం ఒక పర్యాటక ఆకర్షణగానే కాకుండా, రాబోయే తరాలకు సంయమనం, భక్తి మార్గాన్ని చూపే స్ఫూర్తి కేంద్రంగా నిలవనుంది.
అక్షర్ధామ్లో కొలువుదీరనున్న 108 అడుగుల ‘నీలకంఠ వర్ణి’ తపోమూర్తి:
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి