
హిందూ సనాతన ధర్మంలో లయకారకుడైన పరమశివుడి స్వరూపం అత్యంత విశిష్టమైనది. ఆయన రూపంలో ప్రతి అంశానికీ ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ముఖ్యంగా మహాదేవుని నుదుటిపై ఉండే మూడవ కన్ను భౌతిక నేత్రాలకు పూర్తి భిన్నమైనది. సమస్త జీవుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్లు ఉంటే, భౌతిక ప్రపంచానికి అతీతమైన సత్యాన్ని, అంతరంగాన్ని వీక్షించడానికి ఆయనకు మూడో కన్ను ఉంది. దీనినే జ్ఞాన నేత్రం అని పిలుస్తారు. కాలానికి అతీతమైన గతం, వర్తమానం, భవిష్యత్తులను వీక్షించగల శక్తి దీని సొంతం కాబట్టే శివుడిని త్రికాలదర్శి అంటారు.
పురాణాల ప్రకారం పరమశివుడి మూడవ నేత్రం ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. ఒకసారి హిమాలయాల్లో దేవతలు, ఋషులతో శివుడు సభ తీర్చి ఉండగా.. పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి వచ్చి పరమేశ్వరుడి రెండు కళ్లను తన చేతులతో మూసింది. జగత్తుకు మూలాధారమైన స్వామి కళ్లు మూతపడగానే క్షణాల్లో విశ్వమంతా కటిక చీకటి అలుముకుంది. సూర్యచంద్రుల కాంతి సైతం స్తంభించిపోయి.. సమస్త చరాచర సృష్టి అల్లాడిపోయింది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి, సృష్టిని కాపాడటానికి మహాదేవుడు తన నుదుటిపై నుంచి ఒక దివ్యమైన తేజస్సును వెలువరించాడు. ఆ తీవ్ర కాంతి పుంజమే శివుడి మూడవ కన్నుగా ఆవిర్భవించింది.
పురాణాల ప్రకారం మహాదేవుడు తన మూడవ కంటిని తెరిచిన సందర్భాలు తీవ్రమైన మార్పులకు, అజ్ఞాన వినాశనానికి దారితీశాయి.
కామదహనం: తీవ్ర తపస్సులో ఉన్న పరమశివుని ధ్యానాన్ని భంగం చేయడానికి కామదేవుడు ప్రయత్నించినప్పుడు, ఆగ్రహించిన రుద్రుడు తన మూడవ కంటిని తెరిచాడు. ఆ నేత్రాగ్ని జ్వాలలకు కామదేవుడు భస్మమయ్యాడు. ఇది మానవులలోని కామ, క్రోధాలను అంతం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది.
త్రిపురాసుర సంహారం: ముల్లోకాలను పీడిస్తున్న రాక్షసులైన త్రిపురాసురులను, వారి అభేద్యమైన మూడు నగరాలను సంహరించడానికి శివుడు తన త్రినేత్ర దివ్య శక్తిని ప్రయోగించి సమూలంగా నాశనం చేశాడు.
దక్షయజ్ఞ ధ్వంసం: సతీదేవి ఆత్మాహుతి అనంతరం తీవ్ర క్రోధానికి లోనైన మహాదేవుడి ఆగ్రహం నుంచి వీరభద్రుడు జన్మించి, దక్షుని అహంకారాన్ని, యజ్ఞాన్ని నేలమట్టం చేశాడు.
సాధారణంగా శివుడి మూడో కన్ను అంటే కేవలం విధ్వంసానికి, ప్రళయానికి ప్రతీకగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం భౌతిక నాశనం కాదు. అజ్ఞానం, అహంకారం, అసత్యాల సంహారం. పరమశివుడి మూడో కన్ను తెరుచుకోవడం అంటే అంతర్గత చైతన్యం మేల్కొనడం, లోపల ఉన్న పాప ప్రక్షాళన జరిగి సత్య దర్శనం లభించడమేనని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.