
Sripada Srivallabha Mahasamstanam Pithapuram: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. పాదగయ క్షేత్రంగా, పురుహూతికా దేవి శక్తిపీఠంగా భక్తుల ఆదరణ పొందిన ఈ పుణ్యస్థలం, దత్తసంప్రదాయంలో కూడా అత్యంత విశిష్ట స్థానం కలిగి ఉంది. దత్తాత్రేయ స్వామి తొలి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడే జన్మించినట్లు దత్తసంప్రదాయ గ్రంథాలు వివరిస్తాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుడు ధర్మరక్షణ, లోకక్షేమం కోసం అనేక రూపాల్లో అవతరిస్తాడు. వాటిలో జ్ఞానాన్ని ప్రసాదించే అవతారాలలో దత్తాత్రేయుడుకు ప్రత్యేక స్థానం ఉంది. గురు స్వరూపుడైన దత్తాత్రేయుడు అజ్ఞానాన్ని తొలగించి, సాధకుడిని ఆత్మజ్ఞాన మార్గంలో నడిపిస్తాడని భక్తుల విశ్వాసం.
దత్తసంప్రదాయం ప్రకారం కలియుగంలో ధర్మబోధ కోసం దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. చారిత్రక, ఆధ్యాత్మిక ఆధారాల ప్రకారం ఆయన సుమారు 14వ శతాబ్దంలో పీఠికాపురం (ప్రస్తుత పిఠాపురం)లో జన్మించారు. ఆయన జన్మస్థలం నేడు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంగా భక్తులకు దర్శనమిస్తోంది.
దత్తసంప్రదాయ కథనాల ప్రకారం పిఠాపురంలో నివసించిన రాజశర్మ, సుమతి అనే దంపతులు దత్తాత్రేయునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారు. ఒక సందర్భంలో దత్తాత్రేయుడు అవధూత రూపంలో వారి గృహానికి వచ్చి భిక్ష కోరగా, సుమతి సంప్రదాయ నియమాలను పక్కనపెట్టి భక్తితో భిక్ష సమర్పించింది. ఆమె భక్తికి సంతోషించిన దత్తాత్రేయుడు ప్రత్యక్షమై వరం కోరమని అనుగ్రహించాడని కథనం చెబుతుంది.
సుమతి తనకు ధర్మపరుడైన, దివ్యగుణాలు కలిగిన కుమారుడు కావాలని ప్రార్థించగా, దత్తాత్రేయుడు ఆశీర్వదించాడని, అనంతరం జన్మించిన బాలుడికి “శ్రీపాదుడు” అని నామకరణం చేశారని విశ్వసిస్తారు.
యౌవనప్రాయానికి చేరుకున్న తర్వాత శ్రీపాదుడు సంసార జీవితం కన్నా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని సన్యాసదీక్ష స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లిదండ్రులను ఓదార్చి, కుటుంబ సభ్యుల కష్టాలను తొలగించి వారికి దివ్యానుగ్రహం ప్రసాదించాడని దత్తచరిత్రలు వివరిస్తాయి.
పిఠాపురం నుంచి బయలుదేరిన శ్రీపాద శ్రీవల్లభులు కాశీ, బదరికాశ్రమం, గోకర్ణ క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించినట్లు సంప్రదాయం చెబుతుంది. అనంతరం కురుపురంలో కొంతకాలం నివసించి అనేక మందికి దత్తదీక్షను ప్రసాదించారని విశ్వాసం.
దత్తసంప్రదాయం ప్రకారం శ్రీపాద శ్రీవల్లభులు తరువాత నృసింహ సరస్వతిగా మహారాష్ట్రలోని కరంజాలో అవతరించారు. అనంతరం నర్సోబావాడి, ఔదుంబర, గాణగాపురం వంటి ప్రాంతాలలో భక్తులను అనుగ్రహించి పాదుకలను ప్రతిష్ఠించినట్లు దత్తసంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తాయి.
దత్తభక్తులు అత్యంత పవిత్రంగా భావించే ప్రధాన దత్తక్షేత్రాలలో పిఠాపురం, కురుపురం, కరంజా, నర్సోబావాడి, గాణగాపురం ప్రముఖమైనవి. వీటిలో పిఠాపురం దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పిఠాపురాన్ని సందర్శించి శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పురుహూతికా దేవి ఆలయంలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం దత్తసంప్రదాయంలో ప్రాచుర్యంలో ఉన్న ఆధ్యాత్మిక కథనాలు, విశ్వాసాలు, గురుచరిత్ర ఆధారంగా రూపొందించబడ్డాయి. చారిత్రక ఆధారాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు కొన్ని సందర్భాల్లో భిన్నంగా ఉండవచ్చు.)