
హనుమంతుడు చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో భక్తితో ప్రేమతో పూజించే దేవుడు. ఆయన నామం పలికితే చాలు మనసులో కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి భయాలనైనా పోగొట్టే హనుమంతుడి నామ స్మరణకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అలాగే, ఎలాంటి ఆపదల నుంచైనా రక్షణ ఇచ్చే శక్తిగా భావించే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకునే స్తోత్రాల్లో అత్యంత ప్రసిద్ధమైనది హనుమాన్ చాలీసా. దీనిని నిత్యం భక్తితో పఠిస్తే ప్రతికూల శక్తులు దూరమవుతాయని, శని, రాహు–కేతు వంటి గ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వారణాసిలో నివసించిన మహాభక్తుడు తులసీదాసు ఎల్లప్పుడూ శ్రీరామ నామస్మరణలో మునిగిపోయేవారు. ఆయన భక్తి ప్రభావంతో అనేక మంది రామనామ మార్గంలోకి వచ్చారు. ఇది కొందరికి అసహనాన్ని కలిగించడంతో, ఆయనపై అనవసర ఆరోపణలు చేసి ఢిల్లీ దర్బార్(అక్బర్)కు ఫిర్యాదు చేశారు. దీని కారణంగా తులసీదాసును రాజసభకు పిలిపించారు. అక్కడ ఆయనను రామనామ మహిమను నిరూపించమని పరీక్షించారు. అయితే తులసీదాసు, జీవన మరణాలు దైవాధీనమని చెప్పి అద్భుతాలు చూపించడానికి నిరాకరించారు. ఈ ధైర్యానికి కోపగించిన పాలకులు ఆయనను శిక్షించాలనుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తులసీదాసును విడిచిపెట్టాల్సి వచ్చింది. వాటి గురించి తెలుసుకుందాం.
ఆ క్లిష్ట పరిస్థితిలో తులసీదాసు హృదయపూర్వకంగా ఆంజనేయుని ప్రార్థించారు. వెంటనే ఆశ్చర్యకరంగా వానర గణాలు సభలో ప్రత్యక్షమై అందరినీ భయభ్రాంతులను చేశాయి. ఆ కలకలం మధ్య తులసీదాసుకు హనుమంతుని దివ్య దర్శనం కలిగింది. ఆ పవిత్ర క్షణంలో ఆయన ఆంజనేయుని మహిమను స్తుతిస్తూ భక్తి భావంతో నలభై దోహాలతో కూడిన స్తోత్రాన్ని ఆశువుగా రచించారు. ఇదే తరువాత కాలంలో “హనుమాన్ చాలీసా”గా ప్రసిద్ధి చెందింది.
ఆంజనేయ స్వామి ఈ స్తోత్రానికి ప్రసన్నుడై, దీనిని పఠించే భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తానని వరం ఇచ్చినట్లు భక్తులు నమ్ముతారు. అప్పటి నుంచి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా స్తోత్రం భక్తి మార్గంలో అత్యంత పవిత్రమైన ప్రార్థనగా నిలిచింది. Hanuman Chalisa ఒక భక్తి కవిత మాత్రమే కాదు, అది హనుమంతుడి శక్తి మీద విశ్వాసాన్ని పెంచే ఆధ్యాత్మిక గ్రంథం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)