
హోలికా దహనం రోజున వెలిగించే మంట మనిషిలోని కోపం, అసూయ, అహంకారం వంటి ఆలోచనలను దహిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల హోలికా దహనం కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత ఉంది. అయితే ఇందులో ఎలాంటి కలపను వినియోగించాలి, ఏవి నిషిద్ధం అనే విషయాలను సైతం శాస్త్రాలలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చ్ 4 న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే దానికి ఒక్కరోజు ముందు 3న అంటే మంగళవారం రాత్రి హోలికా దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫాల్గుణ పౌర్ణమి రాత్రి జరిగే హోలికా దహనం కార్యక్రమంలో ఎలాంటి కల్పవాడకూడదో మీకు తెలుసా ?.
ముఖ్యంగా ఇందులో రాలిన, ఎండిన కలప ను మాత్రమే వాడాలని శాస్త్రం చెబుతుంది. అదే విధంగా రావిచెట్టును పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. దీన్ని కాల్చటం వల్ల అశుభం అని పండితులు చెబుతున్నారు. దీనితోపాటు పూజలలో వినియోగించే జమ్మి, ఇంటికి తోరణాలుగా ముఖ్యంగా శుభ కార్యాలలో వినియోగించే మామిడి, ఔషధ ప్రాధాన్యత ఉన్న ఉసిరి, దైవస్వరూపంగాను ఆరోగ్యప్రదాయినిగాను భావించే వేప, పూజల్లో వినియోగించే అరటి చెట్లను కాల్చడం శాస్త్రవిరుద్దం. అదేవిధంగా బిల్వ పత్రాలు, ఆ చెట్టు కొమ్మలను దీనికి ఉపయోగించకూడదు. ఈ కార్యక్రమంలో పవిత్రంగా భావించేవి, పూజల్లో వినియోగించే చెట్ల కలప వాడకూడదనేది నిర్వివాదాంశం. నేలపై పడి.. సహజంగా ఎండి పోయిన చెట్ల కట్టెలు, ఎండిన ఆకులు, వరి.. అదే విధంగా గోధుమ పొట్టు, ఎండిన కొబ్బరి ఆకులు.. వాటి మట్టలు వంటి వాటిని వాడవచ్చని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా సజీవంగా ఉన్న చెట్లను కలపను అసలు తీసుకురాకూడదట. అదే విధంగా పర్యావరణానికి హాని కలిగించని కలప వాడటం ఇంకా మంచిది. గోమయంతో చేసిన పిడకలు వినియోగం మంచి ఫలితాన్నిఇస్తుందట.
Also Read: మోటార్ లేకుండా కాలువ నుంచి వాటర్ ఇలా తీయవచ్చు..