
విలువల ఆధారిత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సద్గురు శ్రీ మధుసూదన సాయి అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి కొనియాడారు. సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం సభాభవనంలో వైభవంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాల్లో సద్గురు అందిస్తున్న నిరంతర సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సద్గురు శ్రీ మధుసూదన సాయి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులు భారతీయ విద్యా తత్వాన్ని, విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతున్నాయని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గంలో సద్గురు సమాజానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురు-శిష్య పరంపరకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి చాటుతున్నారని అన్నారు.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఛత్తీస్గఢ్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలను నెలకొల్పి యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారని సీఎం కొనియాడారు. జూలై 26న జన్మదినం జరుపుకోనున్న సద్గురు శ్రీ మధుసూదన సాయికి ఛత్తీస్గఢ్లోని 3 కోట్ల ప్రజల తరఫున సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సద్గురు శ్రీ మధుసూదన సాయి ఆశీర్వచనాలు అందిస్తూ.. ‘‘పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ గురువు మాత్రమే ప్రేమతో విద్యను బోధిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రేమించడం నేర్పించేదే నిజమైన విలువల విద్య. పిల్లలపై ప్రేమ లేని వారికి బోధించే అర్హతే లేదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాల్సిన 5 ముఖ్యమైన సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.
ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహకారానికి ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి సద్గురు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, సమాజం మరియు సేవా సంస్థలు కలిసి పనిచేసినప్పుడే ప్రజాసంక్షేమం వేగంగా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రూపొందించిన పలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించారు. హైస్కూల్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన Be Good, See Good, Do Good పుస్తకాన్ని ఆవిష్కరించారు. విలువల విద్యను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రూపంలో అందించేందుకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ ముగింపు వేడుకల్లో శ్రీ సత్యసాయి లోకసేవ గురుకులం ప్రధాన మార్గదర్శి బి.ఎన్. నరసింహమూర్తి, శ్రీ సత్యసాయి మానవ అభ్యుదయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె. శ్రీకంఠమూర్తిలతో పాటు ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు, 19 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.