ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. రూ.2,937 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం.. ఇంకా పలు కీలక నిర్ణయాలు..

|

Feb 27, 2021 | 5:20 PM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ బేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-22 సంవత్సరానికి..

ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. రూ.2,937 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం.. ఇంకా పలు కీలక నిర్ణయాలు..
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ బేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-22 సంవత్సరానికి 2వేల 937కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్ లో పాలకమండలి మీటింగ్‌ జరిగింది. 80 అంశాలను టీటీడీ పాలకమండలి సమావేశం చర్చించింది. టేబుల్ ఎజెండాగా మరిన్ని అంశాలు చర్చకు వచ్చాయి.

ఏప్రిల్‌ 14నుంచి శ్రీవారి ఆలయంలో అన్ని సేవలకు అనుమతిస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో సమావేశం అయిన ఈ పాలక మండలి..80 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. టేబుల్ ఎజెండాగా మరిన్ని అంశాలపైనా చర్చించి ఆమోద ముద్ర వేసింది.

సమావేశ వివరాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించి నట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ బడ్జెట్ రూ. 2937. 82 కోట్లు గా ఆమోదించడమైనది.

గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించాము. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న భక్తులను ఏప్రిల్ 14వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తాం. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదం

టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించడం జరిగింది. ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏక రూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం. ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని నిర్ణయం. టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గా మార్చేందుకు ఆమోదం. బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్ల.మంజూరుకు ఆమోదం.

అదేవిధంగా కొత్త ఓపిడి భవనంలో మూడవ అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్ల ఆమోదం. టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం. తద్వారా నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు.  తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం. తిరుమలలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులందరికీ డాక్టర్ల సూచనలు పాటిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు తీర్మానం.

త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడానికి నిర్ణయం. శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయం లో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ శివకుమార్, శ్రీ గోవింద హరి, డిపి అనంత, శ్రీ రాములు, డాక్టర్ వాణి మోహన్ పాల్గొన్నారు

Read more:

పోటీ చేశానని నన్ను, నా కుటుంబాన్ని వెలి వేశారు.. అచ్చెన్నాయుడిపై సోదరుడి కుమారుడు సంచలన ఆరోపణలు