
మార్కాపురంః ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన రోడ్షోలో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదాను సాధించుకుందాం అన్నారు. రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకోండి, జగన్ను కళ్లల్లో పెట్టుకోండి అని భావోద్వేగంగా అన్నారు.
రాష్ట్రానికి మంచి చేయడానికి, మీ మంచి కోసం, రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో ఉంచాలని జగన్ ఆరాటపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నవరత్నాలను ప్రతి ఇంటికీ అందించాలని అనుకుంటున్నాడు. అందరూ వివేకంతో ఆలోచించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, జగన్ను గెలిపించాలని కోరుతున్నానని వైఎస్ విజయమ్మ అన్నారు.
వైఎస్ పోయిన తర్వాత బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయని విజయమ్మ చెప్పారు. అయితే జగన్ తల్లి, చెల్లెలు వచ్చారంటూ కొందరు ఎగతాళిగా మాట్లాడుతున్నారని.. వాళ్లు అలా మాట్లాడినా ఫర్వాలేదని అన్నారు. ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, పడ్డవాళ్లు ఎప్పుడూ చెడ్డవాళ్లు కాదని విజయమ్మ చెప్పారు.
తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తాను ఏ రోజూ బయటకు రాలేదని, ఎన్ని మాటలన్నా ప్రజల పక్షాన పోరాడేందుకే జగన్ నిర్ణయం తీసుకున్నాడని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. ఆ రోజున జగన్ జైల్లో ఉన్నప్పుడు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బయటకు వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చిందని, ఈ రోజున ప్రజలందరూ తన కుటుంబం అని భావించి వచ్చానని మార్కాపురంలో విజయమ్మ అన్నారు.