రెడ్యా నాయక్… ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ అనుభవం ఉన్న నేతగా రెడ్యా నాయక్ కు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అధిష్టానం ఆయనకు నిరాశే మిగిలింది. దాంతో ఆయన అలక వహించినట్లు తెలుస్తోంది.
తనకు మంత్రి పదవి రాకపోతే..పోయింది.. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి, తనకంటే జూనియర్ అయిన సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. సత్యవతి రాథోడ్ పదవి బాధ్యతలు చేపట్టిన సమయంలో మహబూబాబాద్ నుంచి అందరూ వెళ్లారు. కానీ రెడ్యా నాయక్ మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో సీనియర్ నేతగా తనకిచ్చే గౌరడం ఇదేనా అంటూ తన సన్నిహితుల వద్ద వాపోయారట నాయక్. మరోవైపు రెడ్యానాయక్ అలక విషయం తెలిసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో రెడ్యా నాయక్ కొంత మెత్తబడ్డారని సమాచారం.
అయితే జిల్లాలో సమీకరణాలు చూస్తుంటే నామినేటెడ్ పదవి కూడా కష్టమని ప్రచారం జరుగుతోంది. రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే, మహబూబాబాద్ ఎంపీగా ఆయన కూతురు కవిత గెలిచారు. దీంతో ఒకే ఫ్యామిలీనుంచి ఇద్దరికి పదవులు దక్కాయి. దీంతో అదే కుటుంబానికి మరో పదవి ఇస్తే బావుండదని టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు చూస్తే రెడ్యా నాయక్ ఎమ్మెల్యేగానే ఉంటూ జూనియర్ ను మంత్రిగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.