ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇవాళ మహబూబ్నగర్ – కర్నూలులో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.. ముందుగా మహబూబ్నగర్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి తెలంగాణకు మోడీ వస్తున్న సందర్భంగా బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన సభతో కమల దళం ఎన్నికల శంఖారావం పూరించనుంది.
ముందుగా ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మహబూబ్నగర్ చేరుకుంటారు. అక్కడ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శృతి పరిచయ కార్యక్రమం అనంతరం మోడీ ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం.. హెలికాఫ్టర్ ద్వారా కర్నూలు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు సిటీలోని ఎస్టీబీసీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు ప్రధాని మోడీ.