ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో పలుమార్లు పర్యటించిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పలు పార్టీల నేతలు ఆయనపై విమర్శలు చేశారు. రాయలసీమలో పోటీ చేసే ధైర్యం పవన్కు లేదంటూ కామెంట్లు పెట్టారు. కాగా అనంతపురం నుంచి తాను ఎందుకు పోటీ చేయలేదో తాజాగా వివరణ ఇచ్చారు పవన్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో గురువారం పవన్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ .. అనంతపురం నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు ఆ స్థైర్యం తనకు ఇవ్వలేదని అన్నారు. అలాగే తనను గెలిపిస్తానన్న భరోసా ఇక్కడి ప్రజలు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని తనకు తెలుసని, అందుకే టీసీ వరుణ్కు టికెట్ ఇచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. ధైర్యం లేని వాళ్లు జనసేనలో ఉండొద్దని, భయపడే నాయకులు తనకు అవసరం లేదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. మార్పు రావాలంటే గొడవలకు సిద్ధమని, కానీ భయపడితే మార్పు రాదని పవన్ అన్నారు.