హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జీవిత, రాజశేఖర్ దంపతులు కలిశారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జగన్ను కలిసిన కొద్దిసేపటికే జీవిత, రాజశేఖర్ దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ చాలా ప్రేమించదగినవాడని చెప్పారు. చంద్రబాబును సూపర్ అన్న టైంలో వైఎస్సార్ వచ్చి తాను సూపర్ డూపర్ అని చూపించారు. ఆ విధంగానే జగన్ కూడా మామూలు బిడ్డ కాదు, పులి బిడ్డ అని చెప్పారు.
ఏ పరిస్థితి వచ్చినా జనాల కోసమే జగన్ ఉన్నారు, జనాల కోసమే ఆలోచించారు, జనాల కోసమే అన్నీ చేస్తున్నారని రాజశేఖర్ అన్నారు. పెద్దింటి పిల్లలు ఎలానో ఉన్నారని, కానీ జగన్ మాత్రం సుఖపడాలని కోరుకోవడం లేదని, ప్రజల కోసం సేవ చేయాలనే కసితో ఉన్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ జగన్ను కలవకుండా తప్పు చేశానే అని భావిస్తున్నట్టు రాజశేఖర్ తెలిపారు. జగన్తో కలిసి న్యాయంగా పని చేస్తూ, న్యాయమైన పోరాటం చేస్తాం. డబ్బు కోసం ఆశపడి తాము పని చేసింది లేదు, చేయబోము అని జీవిత, రాజశేఖర్ దంపతులు తెలిపారు.