ఇంద్రవెల్లి ఓ ఎత్తు, ఇబ్రహీంపట్నం మరో ఎత్తు.. నల్గొండ నాయకులు రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తారా.!

ఇంద్రవెల్లి సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అదే ఊపుతో ఇబ్రహీంపట్నంలో మరో సభకు పీసీసీ సమాయత్తం అవుతోంది. అయితే ఇంద్రవెల్లి సభ..

ఇంద్రవెల్లి ఓ ఎత్తు, ఇబ్రహీంపట్నం మరో ఎత్తు.. నల్గొండ నాయకులు రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తారా.!
Nalgonda Congress Leaders

Updated on: Aug 11, 2021 | 7:56 PM

Telangana Congress Ibrahimpatnam meeting: ఇంద్రవెల్లి సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అదే ఊపుతో ఇబ్రహీంపట్నంలో మరో సభకు పీసీసీ సమాయత్తం అవుతోంది. అయితే ఇంద్రవెల్లి సభ లాగా ఇబ్రహీంపట్నం సభ సక్సెస్ అవుతుందా .. ? ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు రేవంత్ రెడ్డి వెంట కలిసి వస్తారా ..? అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న నాయకులు ఈ దండోరా సభకు వస్తారా .. ? ఇప్పుడిదే కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది.

ఇంద్రవెల్లి సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం ఊరకేలేస్తుంది. ఇదే ఊపుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగా ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన దండోరా రెండో సభ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి సభలోనే ఇబ్రహీంపట్నం సభ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించాడు.

అయితే ఇంద్రవెల్లి సభలా ఇబ్రహీంపట్నం సభ సక్సెస్ అవుతుందా.. పార్టీ ముఖ్య నేతలు, మరీ ముఖ్యంగా నల్లొండ నేతలు ఈ సభ సక్సెస్ కు సహకరిస్తారా.. ఇప్పుడు ఇదే అనుమానం రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నేతలను వేధిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, రేవంత్ రెడ్డి పీసీసీ చైర్మన్ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లే ఉంటుంన్నారు మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు. మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు.

ఈ నల్లగొండ జిల్లా ముఖ్య నేతలెవరు ఇంద్రవెల్లి సభకు రాకపోవడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం.. దీంతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఈ సభ ఉండడంతో ఈ నేతలంతా సహాకరిస్తారా, సభకు వీళ్ళంతా హాజరవుతారా అనే చర్చ పార్టీలో ఇంటర్నల్‌గా జరుగుతోంది.

అయితే ఇంద్రవెల్లిలో జరిగిన సభకు తమకు ఆహ్వానం లేదని బాహాటంగానే చెప్పిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు నల్గొండలో జరుగుతున్న దండోరాకు వెళ్తారో లేదో అని నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒకవేళ కోమటి రెడ్డి బ్రదర్స్ హాజరు కాకపోతే లోకల్ కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీస్కోవాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

కానీ ఇంద్రవెల్లి సభ తరువాత కాంగ్రెస్ జోష్ మరింత పెరిగిన నేపథ్యంలో కచ్చితంగా అందరూ తప్పకుండా హాజరౌతారనే ధీమా రేవంత్ వర్గంలో ఉంది. పార్టీ తరుపున సభలు ఇంత పెద్దఎత్తున సక్సెస్ అవుతున్న తరుణంలో తాము మాత్రం దూరంగా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టిలో తప్పుగా కనిపిస్తాయనే చర్చ కూడా నల్గొండ సీనియర్లలో ఉందట. చూడాలి.. ఇబ్రహీంపట్నం సభ ఎలాంటి మార్పులకు, అంతర్గత పోరుకు దారితీస్తుందో..

Telangana Pcc Chief Revanth Reddy

అశోక్ భీమనపల్లి, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్

Read also: Nara Lokesh: వాళ్లకి జీతాలివ్వకుండా.. ఆ వేల కోట్ల అప్పులు ఎవ‌రి జేబుల్లో వేశారు.. ఆర్థిక నేరాల్లో ఉన్న అతను పీఏసీ సభ్యుడా?: నారా లోకేష్

Follow Us