మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా తూఫ్రాన్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రచార రథం జనరేటర్లో పొగలు వ్యాపించి డీజిల్ లీకేజీతో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన హరీశ్ రావు, మెదక్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు వాహనం దిగి దూరంగా వెళ్లారు.
ఈ వాహనంలో హరీశ్ రావు, ప్రభాకర్ రెడ్డిలతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, భూపతి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చెరకు ముత్యం రెడ్డి తదితరులు ఉండగా.. వారు కూడా వెంటనే ప్రచార రథం నుంచి కిందికి దిగారు. స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బకెట్లతో నీరు తెచ్చి ఆ మంటలు ఆర్పివేశారు. తమ నాయకులకు పెద్ద ప్రమాదం తప్పడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.