అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వివేకా హత్య కేసు విషయంలో ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు.
సాక్ష్యాలన్నీ తొలగించే ప్రయత్నం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. పోలీసులకు మొదట హత్య అని ఎందుకు చెప్పలేదు? హార్ట్ ఎటాక్ అని ఎందుకు నమ్మించారు? కేసులు అవసరం లేదని ఎందుకు అన్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
గుండెపోటు కాదు, ఇది హత్య అని ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచే మా మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు దారణమైన పనులు చేశారని ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన తర్వాత ఆయనను బెడ్ రూంలోకి తీసుకెళ్లడం, బ్లడ్ను తుడిచేయడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం, హార్ట్ ఎటాక్ అంటూ ఎందుకు ప్రచారం ఎందుకు చేశారు? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ను చెడగొట్టారని చంద్రబాబు అన్నారు.
వివేకానంద రెడ్డి మరణ వార్తను అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? ఆ తర్వాత ఆయన మొదట ఆ విషయాన్ని ఎవరికి చెప్పారు? వివేకానంద రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ముందు పలువురు ముఖ్య నేతలు కూడా అక్కడకు వెళ్లారు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారు? సహజ మరణానికి, హత్యకూ తేడా మీకు తెలియదా? సీఐ వెళ్లే సరికే రక్తాన్ని ఎందుకు శుభ్రం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.
మీ ఇంట్లో జరిగిన విషయంలో మీరే వాస్తవాలు చెప్పలేక, మా అందరిపైనా ఆరోపణలు చేయడం ఎంత దారుణమైన విషయం అని అన్నారు. బయటవాళ్లు చంపితే ఒక విధంగా ఉంటుంది. ఇంట్లో వాళ్లు చంపితే సాక్ష్యాలను కనుమరుగు చేయాల్సి ఉంటుంది. అదే జరిగింది. ఎందుకు ఫారెన్సిక్ ఎవిడిన్స్ను మాయం చేయాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదంతా వివాదాస్పదంగా ఉంది, క్షుణ్ణంగా కేసును విచారణ జరిపాల్సిన అవసరం ఉంది. దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు అన్నారు.