
దేశమంతా వినాయక చవితి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నారు.

ఓ గణాధిపా! జన మనో నాయకా వినాయకా! విఘ్నాలు తొలగించు. విజయాలు కలిగించు. కరోనా నుంచి రక్షించు.. మమ్మల్ని ఆశీర్వదించు అంటూ ప్రతి ఒక్కరు ఆ గణనాధుడిని పూజిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో వినాయక ప్రతిమల ముందు పూజలు చేస్తున్నారు.

పల్లె పల్లెల్లోనూ, వీధివీధినా తీరొక్క గణేశుడి రూపాలు కొలువుదీరాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు సైతం వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ప్రగతిభవన్లో వినాయక చవితి వేడుకలను కేసీఆర్ కుటుంబం ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నాలు తొలగించి, తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని పార్వతీ తనయుడు గణనాథున్ని సీఎం కేసీఆర్ వేడుకున్నారు.

ప్రగతి భవన్లో నిర్వహించిన గణేషుడి ప్రత్యేక పూజలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దంపతులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

వినాయక చవితి వేడుకల్లో మంత్రి కేటీఆర్

ప్రగతి భవన్ వినాయక చవితి వేడుకల్లో పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్