తెలుగు నేల పులికించే వేళ ఆసన్నమైంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి నిలువెత్తు నిదర్శనమైన సమతమూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మహోత్సవాలకు దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ బృహత్క్యార్యానికి రావాలంటూ త్రిదండి చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు.
ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ ఢిల్లీలోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వాన పత్రాన్ని అందించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలకు ఆహ్వాన పత్రాలు అందించారు. చినజీయర్ స్వామితోపాటు మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు.
తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ నివాసాలకు వెళ్లి చినజీయర్ స్వామి రామానుజ విగ్రహ ప్రతిష్టాపణకు రావాలంటూ ఆహ్వాన పత్రాలను అందజేశారు.
ఇరువురు మంత్రులు కూడా గంట పైగా సమతామూర్తి విగ్రహ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా విగ్రహ ప్రతిష్టాపనకు వస్తామని చినజీయర్ స్వామికి తెలిపారు.
శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు.
విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు.