అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్తో తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో సుమారు గంటపాటు చర్చించారు.
వీరిద్దరూ వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, అఫ్గానిస్థాన్ అంశాలపై చర్చలు జరిపారు. మొదట శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశం ఎంతో కీలకమైందన్న మోడీ.. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.