
రూ.2 వేల కోసం కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఊహించని ఈ పరిణామంతో మృతుడి కుటుంబం అనాథగా మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ఔన్పూర్లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి రూ.2 వేల కోసం తన ఫ్రెండ్స్తో పందెం వేశాడు. 50 గుడ్లను ఆగకుండా తినేస్తానని బెట్ కట్టాడు. దీంతో మిత్రులు అతడి ముందు 50 గుడ్లు తెచ్చిపెట్టారు.

యాదవ్.. తొలుత వన్ బై వన్ గుడ్లు తింటూ ఎదుటివారిని ఆశ్యర్యపరిచాడు. 42వ గుడ్డు తింటున్న సమయంలో ఒక్కసారే స్పృహ తప్పి అచేతనంగా కింద పడిపోయాడు. దీంతో అతడిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాడు.

కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. గుడ్లు రోజుకు రెండు తింటే మంచింది. కానీ, అతిగా వెళ్తే.. ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.

అతడు గుడ్లు తినడం వల్ల ఎందుకు చనిపోయాడనే కోణంలో టెస్టులు చేసిన డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అతడి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని కనుగొన్నారు. ముఖ్యంగా గుడ్డులో ఉండే పచ్చ సొనలో అధిక కొవ్వులు ఉంటాయని, దీనివల్ల గుండె పనితీరు నెమ్మదించి చనిపోయాడని తెలిపారు.