
తాజాగా నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చు మర్రు గ్రామంలో ఓ ఇంటిపై భారీ పిడుగు పడింది. ఆ పిడుగు తీవ్రత ఎలా ఉందంటే... ఏకంగా ఇంటి భవనం స్లాబు పగిలి ఇంట్లోని బెడ్రూమ్లో పడింది.

ఏప్రిల్ 22 తెల్లవారుజామును ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం మొదలైంది. ఈ క్రమంలో భారీగా పిడుగులు కూడా పడ్డాయి.

ముచ్చుమర్రు గ్రామానికి చెందిన శేషన్న ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో శేషన్న కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్నారు. ఇంతలో ఇంటిపై పెద్ద శబ్ధం వినబడింది.

ఏంజరిగిందో తెలుసుకునేలోపు స్లాబ్ పగలగొట్టుకొని వారు నిద్రిస్తున్న మంచం పక్కనే పిడుగు పడింది. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

పిడుగు తీవ్రతకు ఇల్లు ధ్వంసమైంది. పెను ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.